Rains: తెలంగాణలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. గత పది రోజులుగా ముఖ్యంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం పడుతోంది. సాయంత్రం కాగానే వర్షం స్టార్ట్ అవుతోంది. వర్షం వాహనదారులను ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ సీజన్లో ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ లో పది నిమిషాల సేపు వర్షం పడినా మెయిన్ రోడ్లు మొదలుకుని ఇంటర్నల్ రోడ్ల వరకు ఎక్కడ చూసినా చెరువులను తలపిస్తున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్ జామ్లతో జనం నరకం చూస్తున్నారు. అయితే గత రెండు రోజుల నుంచి భాగ్యనగరంలో పెద్దగా వర్షాలు పడడం లేదు. అయితే ఈ రోజు హైదరాబాద్ నగరంలో పలు చోట్ల మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఈ 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలోని పలు జిల్లాల ప్రజలను వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేశారు. రాష్ట్రంలో 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఉమ్మడి ఆదిలాబాద్ (ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల), ఖమ్మం (ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం), నిజామాబాద్ (నిజామాబాద్, కామారెడ్డి) జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, గద్వాల, కరీంనగర్, ములుగు, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. పైన పేర్కొన్న 21 జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ALSO READ: Kadapa News: తండ్రిని బంధించి.. కన్న తల్లి గొంతుకోసి దారుణంగా చంపి, అనంతరం టీవీ చూస్తూ..?
మరి కాసేపట్లో ఈ ఏరియాల్లో కుండపోత వాన..
మరి కాసేపట్లో నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్, వికారాబాద్, నిజామాబాద్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.హైదరాబాద్ పొడి వాతావరణ కొనసాగనుందని చెప్పారు. రాత్రి సమయంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపారు. అక్కడక్కడ పిడుగులు కూడా పడే అవకాశం ఉందని అధికారులు వివరించారు.
పిడుగులు పడే ఛాన్స్.. జాగ్రత్త..!
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణా రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ముఖ్యంగా రైతులు సాయంత్రం వేళ పొలాల వద్దకు వెళ్లొద్దని హెచ్చరించారు. పిడుగులు పడే ఛాన్స్ ఉండడంతో చెట్ల కింద నిలబడొద్దని చెబుతున్నారు. భారీ వర్షం పడుతున్న సమయంలో ఇంట్లో నుంచి ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దని సూచించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు తెలిపారు.