Heavy Traffic Jam: సంక్రాంతికి హైదరాబాద్ వాసులు సొంతూరి బాట పట్టారు. రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నేటి నుంచి 17 వరకు పండగ సెలవులను ప్రకటించాయి. ఇక ఈరోజు రెండో శని వారం కావడంతో నిన్నటి నుంచే రద్దీ మొదలైంది. సోమవారం భోగి కావడంతో.. శని, ఆది రెండ్రోజులు రద్దీ అధికంగా ఉండనుంది. కూకట్పల్లి, లక్డీకపూల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం అవుతోంది. ఆంధ్ర వైపు వెళ్లే బస్సులన్నీ ఫుల్ అయ్యాయి. తెలంగాణ, ఏపీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సులు కూడా ఏర్పాటు చేశాయి.
దీంతో హైదరాబాద్-విజయవాడ హైవే కళకళలాడిపోతోంది. హైదరాబాద్లో ఉండే ఏపీ వాసులు కుటుంబాలతో కలిసి గ్రామాలకు పయనమయ్యారు. ఇక పండుగకని సొంతూళ్ల బాట పట్టిన ప్రజలతో.. జాతీయరహదారిపై విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. సాధారణ రోజుల కంటే 50 శాతం ట్రాఫిక్ పెరిగింది. అటు రాత్రి నుంచే LB నగర్లో బస్సుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. మామూలుగానే LBనగర్ పరిసరాలు వాహనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో నల్లగొండ జిల్లాలోని పంతంగి టోల్ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. ఇవాళ, రేపు.. ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. దాంతో పోలీసులు వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపిస్తున్నారు. ఈ సంక్రాంతి హడావిడితో మరింత సందడి వాతావరణం కనిపిస్తోంది.
మరోవైపు హైదరాబాద్- విజయవాడ హైవేపై RTA అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రైవేట్ బస్సులను తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని10 ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు చేశారు. సంక్రాంతి వేళ ప్రైవేటు బస్సులు అధికంగా టికెట్ రేట్లు వసూలు చేస్తుండటంతో సమాచారం అందుకున్న అధికారులు ఈ దాడులు చేశారు.
సంక్రాంతి నేపథ్యంలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. పండుగకు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకుందాం అనే ఆనందం ఒక వైపు ఉంటే.. మరోవైపు మాత్రం ఆకాశాన్ని అంటే రేంజ్ లో ప్రైవేట్ ట్రావెల్స్ ధరలు గుండెల్ని గుబెల్ అనిపిస్తున్నాయి.
సందిట్లో సడేమియాగా ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్ల ధరలు పెంచేసి దోచుకుంటున్నాయి. సీటుకో రేటు చొప్పున వసూలు చేస్తూ అడ్డగోలుగా దోచుకుంటున్నారు ప్రైవేట్ ట్రావెల్స్. అడిగేవాడు లేడు.. ఒక వేళ అడిగినా.. ఇష్టం ఉంటే ఎక్కండి.. లేదంటే లేదు అని మొహానే చెప్పేస్తున్నారు. సాధారణంగా కంటే నాలుగు రేట్లు టికెట్ రేట్లు పెంచారని వాపోతున్నారు. ఓ పక్క రైళ్లన్నీ ఫుల్ అవ్వడంతో.. గేజీ, పిల్లలతో కలిసి ట్రైన్లో నిలబడి ప్రయాణం చేయలేక.. తప్పనిసరి పరిస్థితుల్లో.. ముందు ఇంటికి వెళ్ళడం కోసం ఉన్నవన్నీ ఊడ్చి బస్సులకే పెడుతున్నామని వాపోతున్నారు.
Also Read: కోడి పందాల్లో తగ్గేదేలే అంటోన్న పందేం రాయుళ్లు.. ఎన్ని వందల కోట్ల బిజినెస్ జరగబోతుందో తెలుసా?
మరోవైపు ఆర్టీసీ సైతం అదనపు చార్జీల పేరుతో ప్రయాణికులను దోచుకుంటున్నారు. మామూలు రోజుల్లో ఏసీ స్లీపర్ బస్సుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు మాగ్జిమం 700 రూపాయలు ఉంటే.. ప్రస్తుతం1,050 తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలకు టీజీ ఆర్టీసీ 6 వేలకు పైగా ప్రత్యేక షటిల్స్ నడుపుతోంది. వీటిలో 50 శాతం అదనపు చార్జీలను వసూలు చేస్తున్నారని అంటున్నారు. చార్జీలు పెంచుతున్నా అధికారులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.