HC on Contract Employees : ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గత బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవో నెం.16 ను రద్దు చేసింది. ఈ నిర్ణయం చెల్లదని స్పష్టం చేసిన హైకోర్టు.. ఇది నిబంధనల విరుద్ధమని తెలిపింది. నియామకాల్లో ఇలాంటి చర్యల కారణంగా నిరుద్యోగులు నష్టపోతారంటూ వ్యాఖ్యానించింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్న వారిని క్రమబద్ధీకరిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై మొదటి నుంచి నిరసన తెలుపుతున్న నిరుద్యోగులు.. ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందంటూ హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు తీర్పులకు విరుద్ధంగా ఇలాంటి క్రమబద్ధీకరణ చేయడం సరికాదంటూ పిటీషనర్ల తరఫున న్యాయవాదులు వాదించారు.
ప్రభుత్వం ఉద్యోగాల నియామకాలలోని సెక్షన్ 10ఏ సవరణ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా జీవో నెం.16 ను తీసుకువచ్చింది. ఈ నిర్ణయంతో 5వేల మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగులను.. శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చేసింది. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించగా, ప్రభుత్వ విధానాన్ని తప్పుపట్టింది. ఇది రాజ్యంగా విరుద్ధమన్న హైకోర్టు.. ఈ ఉత్తర్వులని రద్దు చేసింది.
ఇప్పటికే.. శాశ్వత ఉద్యోగులుగా మారిన కాంట్రాక్ట్ లెక్చరర్లను తొలగించవద్దన్న హైకోర్టు.. ఇక మీద భర్తీ చేసే ఉద్యోగాలన్నీ చట్ట ప్రకారం చేయాలని సూచించింది. ఇప్పటికే.. ఈ మేరకు సుప్రీం కోర్టు అనేక సార్లు ఉత్తర్వులు ఇచ్చింది.. అయినా ప్రభుత్వాలు అప్పటి అవసరాల మేరకు జీవోలు ఇస్తూ, ఉద్యోగాల భర్తీలు చేస్తున్నారు. కానీ.. ఈ విధానంపై అన్ని వర్గాల నుంచి అసంతృప్తి ఉంది. అవేవీ పట్టించుకోని ప్రభుత్వాలు.. ఎన్నికల ముందో, ఏదైనా నిరసనల సమయంలోనూ క్రమబద్ధీకరణ చేస్తూ.. కోర్టుల ఉత్తర్వులను, నిరుద్యోగుల ఆశల్ని విస్మరిస్తున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తంగా 5,544 కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని (contract employees ) క్రమబద్ధీకరణ చేసింది. అందులో.. 2,909 మంది జూనియర్ లెక్చరర్లు(Junior Lecturers), 184 మంది జూనియర్ లెక్టరర్లు (వొకేషనల్) (Junior Lecturers (Vocational)) 390 పాలిటెక్నిక్ (Polytechnic), 270 డిగ్రీ లెక్చరర్లు (Degree lecturers), సాంకేతిక విద్యా శాఖలో 131 అటెండర్లు, వైద్య, ఆరోగ్య శాఖలో 837 మంది మెడికల్ అసిస్టెంట్లు, 179 ల్యాబ్ టెక్నీషియన్లు, 158 ఫార్మాసిస్టులు ఉన్నారు.
Also Read : లగచర్ల కేసులో కీలక నిందితుడు లొంగుబాటు..
ప్రస్తుతానికి వీరందరి ఉద్యోగాల్లో ఎలాంటి మార్పులు చేయవద్దన తెలంగాణ హైకోర్టు.. ఇకపై రాష్ట్రంలో భర్తీ చేసే ఉద్యోగాలన్నీ నోటిఫికేషన్ ద్వారానే జరగాలని ఆదేశించింది. అలా జరిగితేనే.. నిరుద్యులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, లేదంటే వాళ్లకు అన్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించింది.