Telangana High Court: తెలంగాణ హైకోర్టు సిగాచి పేలుళ్ల ఘటన దర్యాప్తు తీరుపై పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై (PIL) ప్రధాన న్యాయమూర్తి (సీజే) నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ ఘటన సాధారణమైంది కాదని.. ఇందులో 54 మంది కార్మికులు చనిపోయారని సీజే వ్యాఖ్యానించారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) కోర్టుకు తెలిపారు. దీనిపై సీజే ప్రశ్నిస్తూ.. 237 మంది సాక్షులను విచారించినా ఇప్పటి వరకు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడం ఏమిటని నిలదీశారు.
ఇంత పెద్ద ఘటన జరిగితే ఇంతవరకు బాధ్యులు ఎవరో ఎందుకు తేల్చలేదని ప్రశ్నించారు. పేలుడు సంభవించి ఐదు నెలలు దాటినా ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయకపోవడాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇంత పెద్ద ఘటనకు డీఎస్పీని దర్యాప్తు అధికారిగా నియమించడంపై సీజే తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ స్థాయి ఘటనకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాల్సింది కదా అని వ్యాఖ్యానించారు. పోలీసు దర్యాప్తు తీరుపై సంతృప్తి చెందకపోవడంతో.. తదుపరి విచారణకు దర్యాప్తు అధికారి (డీఎస్పీ) కోర్టు ఎదుట హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది.
నిపుణుల కమిటీ నివేదిక అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రస్తావించారు. పరిశ్రమ నిర్వహణలో లోపాలు ఉన్నాయని.. నిబంధనలకు విరుద్ధంగా 17 టన్నుల సోడియం క్లోరైడ్ను నిల్వ చేశారని నివేదికలో తేలిందని తెలిపారు. పేలుడు తీవ్రత అధికంగా ఉండటంతో 8 మంది మృతదేహాలు ఆనవాళ్లు లేకుండా కాలిపోయాయని న్యాయవాది వాదించారు. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఏఏజీ కోర్టుకు తెలియజేశారు.
అయితే, హైకోర్టు పోలీసు దర్యాప్తు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేసింది. ఈ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరగడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.