Janagama Municipality: జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ తీవ్ర ఉత్కంఠకు, గందరగోళానికి దారితీసింది. మున్సిపల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య పోటాపోటీ నినాదాలు, తోపులాటలు జరగడంతో శాంతిభద్రతల సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో, పరిస్థితులు అనుకూలంగా లేవని భావించిన ఎన్నికల అధికారులు పోలింగ్ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపింది.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నిరసన
అధికారుల నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తన అనుచరులు, కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించారు. కాంగ్రెస్ ఎంపీ, స్థానిక నేతలు కావాలనే ఎన్నికను అడ్డుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. మెజారిటీ తమకే ఉన్నప్పటికీ, అధికార బలంతో ఎన్నికను వాయిదా వేయించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆయన మండిపడ్డారు.
పోలీస్ అధికారుల తీరుపై విమర్శలు
ఈ గందరగోళంలో పోలీసుల పాత్రపై పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ఒక ముస్లిం మహిళా కౌన్సిలర్ను డీసీపీ స్థాయి అధికారి భయభ్రాంతులకు గురిచేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని, బాధ్యులైన డీసీపీ, ఏసీపీలపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని, వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
కాంగ్రెస్ నాయకులు క్షేత్రస్థాయిలో ఓడిపోతామనే భయంతోనే అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎన్నిక ప్రక్రియను నిలిపివేయించారని బిఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ప్రశాంతంగా సాగాల్సిన ఎన్నికను రణరంగంగా మార్చారని వారు విమర్శిస్తున్నారు. మరోవైపు, కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ ఆరోపణలను తిప్పికొడుతూ, నిబంధనల ప్రకారమే అంతా జరుగుతోందని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: బద్ధశత్రువుల మధ్య ‘మున్సిపల్’ మొహబ్బత్.. మూడు పార్టీలు ఒక్కటయ్యాయిలా!
అయోమయంలో మున్సిపల్ పాలన
చైర్మన్ ఎన్నిక వాయిదా పడటంతో మున్సిపాలిటీలో పాలనాపరమైన ప్రతిష్టంభన ఏర్పడింది. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన వేదిక కాస్తా రాజకీయ ప్రయోజనాల కోసం రణస్థలిగా మారడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తదుపరి ఎన్నిక ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ లోపు రాజకీయ సమీకరణాలు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది.