Suryapet Accident: తెలంగాణలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రావెల్ బస్సు.. కంటైనర్ ను ఢీ కొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. గాయపడిన వారిలో కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అసలు ఘటన ఎలా జరిగింది?
సూర్యాపేట్ జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోదాడ మండలం దొరకుంట శివారులో ఓ ట్రావెల్ బస్సు.. కంటైనర్ వాహనాన్ని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు స్పాట్లో మృతి చెందగా, దాదాపు 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన విషయం తెలియగానే పోలీసులు, అంబులెన్సులు అక్కడికి చేరుకున్నాయి. కంటైనర్లో ఇనుప చువ్వలు ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని చెబుతున్నారు. ఘటన సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు.
అందులో విజయవాడకు వెళ్తున్నవారు 17 మంది ఉన్నారు. హనుమాన్ జంక్షన్ వద్ద దిగాల్సివారు నలుగురు ఉన్నారు. గన్నవరంలో ఒకరు, ఏలూరులో దిగాల్సినవారు 22 మంది ప్రయాణికులు ఉన్నారు. దాదాపు ఐదు గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు చెబుతున్నారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నాడు. పరిశ్రమలకు ఉపయోగించే పైపులు, రాడ్లు కంటైనర్ వాహనంలో ఉన్నాయి. ట్రావెల్ బస్సు ఏసీది కావడంతో ఏం జరిగిందో తెలుసుకునే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
అతివేగం లేకుంటే డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా? అనేది ఇంకా తెలియరాలేదు. ప్రమాదం కారణంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొన్ని గంటలపాటు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్న బాధితుల నుంచి వివరాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు.
ఈ ప్రమాదానికి ముందే కంటైనర్ వాహనం ప్రమాదానికి గురై రోడ్డుపై ఉంది. వాహనం సగం రోడ్డు, మిగతా సగం డివైడర్పై ఉంది. అతి వేగంతో వెళ్తున్న ట్రావెల్ బస్సు, కంటైనర్ ను ఢీ కొట్టినట్టు ప్రయాణికులు చెబుతున్నారు. కంటైనర్ అందుకుముందు ప్రమాదానికి గురైందా? బస్సు ఢీ కొట్టడం వల్లే డివైడర్పై ఉందా? అనేదానిపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
ALSO READ: హరీశ్ రావు ‘హైటెక్’ అవినీతి.. ఎక్స్ వేదికగా మంత్రి పొంగులేటి సంచలన ఆరోపణలు!