Konda Surekha Issue: మంత్రి కొండా సురేఖ వివాదం కాంగ్రెస్ లో ఏ స్థాయిలో దుమారం రేపిందో అందరి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై విచారణ జరిపిన క్రమశిక్షణ కమిటీ.. ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించాలని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. పార్టీ లైన్ దాటితే చర్యలు తీసుకోవాల్సిందే అని తాజాగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు ఇచ్చిన రిపోర్ట్ లో క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమని.. చర్యలు తీసుకోకపోతే పార్టీకి నష్టమని రిపోర్ట్ లో తేల్చి చెప్పినట్లు సమాచారం. అటు చిన్నారెడ్డిని ప్లానింగ్ కమిషన్ నుంచి తప్పించాలని సూచించింది.
Also Read: మోదీని టెర్రరిస్ట్ అన్న వ్యక్తితో భేటి ఎందుకు? సీఎం రేవంత్ జవాబు చెప్పాలి.. కిషన్ రెడ్డి నిలదీత
టీపీసీసీ చీఫ్ కు నివేదిక సమర్పించిన అనంతరం.. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి మీడియాతో మాట్లాడారు. కఠిన చర్యలు తీసుకోవాలని నివేదకలో పేర్కొన్నట్లు తెలిపారు. ‘క్రమ శిక్షణతో ఉంటేనే పార్టీలో గౌరవం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ గౌరవం దెబ్బతీసేలా, భవిష్యత్ ఎన్నికల్లో ప్రభుత్వంకి నష్టం జరిగేలా ప్రవర్తన మంచిది కాదు. కొండ సురేఖ, చిన్నా రెడ్డి ఇద్దరి అంశంపై నివేదిక అందించాం. కొండా సురేఖ, చిన్నా రెడ్డి ఇచ్చిన సమాధానాలు, మీడియాలో ఏం మాట్లాడారో పరిశీలించి సమగ్ర రిపోర్ట్ ను రూపొందించాం’ అని మల్లు రవి చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డితో మల్లు రవి భేటి కాబోతున్నారు. రేవంత్ ను కలిసి.. నివేదికలోని అంశాలను వివరించనున్నారు. అయితే ఇప్పటికే సీఎం రేవంత్.. కొండా సురేఖ వివాదంపై స్పందించారు. ఈ అంశం క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉందని.. పార్టీ అంతర్గత విషయాలపై తాను బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయనని పేర్కొన్నారు. పార్టీ తీసుకునే నిర్ణయాలకు తామంతా కట్టుబడి ఉంటామని ప్రకటించారు.
ఇక కొండా సురేఖ వివాదానికి వస్తే.. ఇటీవల ఆమె కుమార్తె సుస్మితా పటేల్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై నేరుగా వ్యక్తిగత విమర్శలు చేశారు. సీఎంకు కాంగ్రెస్ సంస్కృతి ఏమాత్రం అబ్బలేదన్న ఆమె.. టీడీపీ నుంచి వచ్చిన వారిపై ప్రేమ కురిపిస్తున్నారని ఆరోపించారు. పరకాలలో తనను కాకుండా రేవురి ప్రకాశ్ రెడ్డిని ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఎలా ప్రకటిస్తారని సుస్మితా నిలదీశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు ఎవరూ ఆనందంగా లేదన్నారు. అయితే కూతురు చేసిన వ్యాఖ్యలను సురేఖ ఏమాత్రం ఖండించకపోవడం మరింత వివాదస్పదంగా మారింది. ఆమె వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని మాత్రమే ప్రకటించడం చర్చకు తావిచ్చింది.
Also Read: చెత్తకుప్పలోని చాక్లెట్ల కోసం ఎగబడ్డ జనం.. కాన్పూర్లో షాకింగ్ ఘటన!