Fake Doctors: అర్హతలు లేకున్నా డాక్టర్లుగా చలామణి అవుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటాలాడుతున్న 12 మంది నకిలీ డాక్టర్లను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురిని జూబ్లీహిల్స్ జోన్ లో పట్టుకోగా.. మరో ఆరుగురిని సికింద్రాబాద్ జోన్ లో అరెస్ట్ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు వివరాలను టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు.
జూబ్లీహిల్స్ జోన్ పరిధిలో కొంతమంది ఎలాంటి విద్యార్హతలు లేకున్నా డాక్టర్లుగా చలామణి అవుతూ జనానికి వైద్యం చేస్తున్నట్టుగా టాస్క్ ఫోర్స్ సిబ్బందికి సమాచారం అందింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు.. సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. మధురానగర్ స్టేషన్ పరిధిలోని రహమత్ నగర్ చౌరస్తా వద్ద ఉన్న శ్రీ ఆక్వా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పై దాడి చేశారు. ఇదే ప్రాంతంలో డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్ కోర్సు చేసిన రాగం సుధాకర్ క్లినిక్ నడిపిస్తున్నట్టుగా తెలియటంతో అతన్ని కూడా అరెస్ట్ చేశారు. డాక్టర్ గా చలామణి అవుతున్న సుధాకర్ రోజుకు 40 నుంచి 50మంది రోగులకు వైద్యం చేస్తూ ఒక్కొక్కరి నుంచి 200 రూపాయలు ఫీజుగా వసూలు చేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది.
మరోవైపు గతంలో నర్సుగా పనిచేసిన మిరుదొడ్డి భారతి.. 4 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి డాక్టర్ అవతారమెత్తింది. ఓ క్లినిక్ ప్రారంభించి ఒక్కొక్కరి నుంచి 50 నుంచి 100 రూపాయల ఫీజు వసూలు చేస్తూ రోజుకు 15 మంది రోగులకు చికిత్స చేస్తోంది. అటు జూబ్లీహిల్స్ వెంకటగిరి ప్రాంతంలో బీఏ చదివిన కాటిక మహేశ్ రావు ఓ గదిని అద్దెకు తీసుకుని క్లినిక్ మొదలు పెట్టాడు. తన వద్దకు వచ్చే ఒక్కొక్కరి నుంచి 100 రూపాయలు ఫీజుగా తీసుకుంటూ రోజుకు 40 నుంచి 50మందికి చికిత్స చేస్తున్నాడు.
ఇక, ఫార్మసీ నడుపుతున్న పానుగంటి బాల నరసింహ కూడా డాక్టర్ గా చలామణి అవుతున్నాడు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీకి సిద్ధమవుతున్న తన కూతురి పేరును వాడుకుంటూ క్లినిక్ ఏర్పాటు చేసి ఒక్కొక్కరి నుంచి 100 రూపాయలు ఫీజుగా తీసుకుంటూ రోజుకు 30 నుంచి 40మందికి చికిత్స చేస్తున్నాడు. అటు ఇంటర్ చదువుతూ ఆపేసిన మహ్మద్ అబ్దుల్ వలీ.. గతంలో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేసిన అనుభవంతో గంగానగర్ వెజిటబుల్ మార్కెట్ వద్ద క్లినిక్ తెరిచాడు. రోజుకు 10-20 మంది రోగులకు వైద్యం అందిస్తున్నాడు.
Also Read: మూసీ ప్రాజెక్ట్పై సీఎం రేవంత్ ఉన్నతస్థాయి సమీక్ష.. ఫేజ్-2 టెండర్లకు కసరత్తు ప్రారంభం!
ఇక, సికింద్రాబాద్ జోన్ లో మరో ఆరుగురు నకిలీ డాక్టర్లు పట్టుబడ్డారు. ఏలూరు జిల్లాకు చెందిన నీలగిరి ప్రసాద్ గతంలో కాంపౌండర్ గా పనిచేసి.. ఈ అనుభవంతో నకిలీ ఎంబీబీఎస్, బీహెచ్ఎంఎస్ సర్టిఫికెట్లను సృష్టించి చిలకలగూడలోని ‘ఫ్యామిలీ క్లినిక్’ లో చైల్డ్ స్పెషలిస్ట్ డాక్టర్గా చలామణి అవుతున్నాడు. అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు నకిలీ సర్టిఫికెట్లు, డాక్టర్ స్టాంప్, స్టెతస్కోప్, బీపీ మెషిన్, ఇంజెక్షన్లు, వివిధ రకాల మందులను సీజ్ చేశారు. ఇలా సికింద్రాబాద్ జోన్ లో మెుత్తం ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.