KTR: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు (కేటీఆర్), ప్రముఖ కవి, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్నకు సంబంధించి సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Model Code of Conduct – MCC)ని ఉల్లంఘించారనే ఆరోపణలపై వారిద్దరిపై కేసు నమోదైంది. హైకోర్టు తాజా తీర్పుతో కేటీఆర్, గోరెటి వెంకన్నకు ఈ కేసులో ఊరట లభించినట్లయింది.
2023 నవంబర్ ఎన్నికల సందర్భంగా.. హైదరాబాద్లోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్, గోరెటి వెంకన్నపై ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల జ్యోతి (Martyr’s Memorial) వద్ద కేటీఆర్, గోరెటి వెంకన్నతో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే ఈ ఇంటర్వ్యూ జరిగిందని.. అంతేకాకుండా అనుమతి లేకుండా డ్రోన్ను కూడా ఎగురవేశారని పోలీసులు తమ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
ఈ ఇంటర్వ్యూలో గోరెటి వెంకన్నను ఉద్దేశించి కేటీఆర్ ప్రభుత్వ పథకాల గురించి ప్రశ్నించారని.. దీని ద్వారా అప్పటి అధికార పార్టీ అయిన బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చే విధంగా ప్రచారం చేశారని పోలీసులు ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ స్థలాన్ని ఉపయోగించుకోవడం, అనుమతులు లేని కార్యకలాపాలు నిర్వహించడం నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందని పోలీసులు తమ ఫిర్యాదులో తెలిపారు.
పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను సవాలు చేస్తూ కేటీఆర్, గోరెటి వెంకన్న తరఫు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ… ఈ కేసు కేవలం రాజకీయ లబ్ధి కోసమే, దురుద్దేశంతో నమోదు చేయబడిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రాజకీయ ప్రత్యర్థులను అణచివేయాలనే ఉద్దేశంతోనే ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన పేరుతో ఈ ఫిర్యాదు చేశారని ఆయన కోర్టుకు వివరించారు. ఈ ఇంటర్వ్యూలో ఎలాంటి చట్ట ఉల్లంఘన జరగలేదన.., పోలీసులు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని ఆయన స్పష్టం చేశారు.
సుదీర్ఘంగా జరిగిన విచారణలో ఇరు పక్షాల వాదనలను పోలీసులు సమర్పించిన ఆధారాలను హైకోర్టు క్షుణ్ణంగా పరిశీలించింది. వాదనలు, పత్రాల పరిశీలన అనంతరం కేటీఆర్ , గోరెటి వెంకన్నపై సైఫాబాద్ పీఎస్లో నమోదైన ఎఫ్ఐఆర్లో తగినంత ప్రాథమిక ఆధారం లేదని, లేదా కేసు నమోదు వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయనే వాదనతో ఏకీభవించి… వారిపై నమోదైన కేసును పూర్తిగా కొట్టివేస్తూ హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఈ నిర్ణయం బీఆర్ఎస్ నాయకత్వానికి.. ముఖ్యంగా కేటీఆర్కు పెద్ద ఊరటగా పరిగణించవచ్చు.
ALSO READ: 5K Run for Peace: హైదరాబాద్లో 5K రన్ ఫర్ పీస్లో పాల్గొనండి.. ఈజీగా రూ.25,000 గెలుచుకోండి