Huzurabad municipality: హుజూరాబాద్ బ్యూరో, స్వేచ్ఛ: హుజూరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మున్సిపల్ చైర్పర్సన్గా రెంటాల సుహాసిని, వైస్ చైర్పర్సన్గా గూడూరు అంజలి ఎన్నికయ్యారు. డీఆర్డీఓ శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ ప్రత్యేక సమావేశంలో నూతన పాలకవర్గాన్ని అధికారికంగా ప్రకటించారు. మొత్తం 30 వార్డులున్న హుజూరాబాద్ మున్సిపాలిటీలో 143 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇటీవలి ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 16 మంది, బీఆర్ఎస్ నుంచి 8 మంది, బీజేపీ నుంచి 5గురు అభ్యర్థులు గెలవగా, ఒకరు స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. మొత్తం 29,531 ఓట్లకు గాను 24,060 ఓట్లు (81 శాతం) పోలయ్యాయి. చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ (కోరం) కోసం కాంగ్రెస్ పార్టీకి తమ 16 మంది కౌన్సిలర్లతో పాటు, స్వతంత్ర అభ్యర్థి గోస్కుల రాజు మద్దతు లభించింది. దీంతో మొత్తం 17 మంది సభ్యుల బలంతో కాంగ్రెస్ పీఠాన్ని కైవసం చేసుకుంది.
ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కౌన్సిలర్లను రహస్య క్యాంపునకు తరలించిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం ప్రత్యేక బస్సులో 16 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, ఒక స్వతంత్ర అభ్యర్థి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. కోరం పూర్తిస్థాయిలో ఉండటంతో ఎన్నికల అధికారి ప్రక్రియను ప్రారంభించారు. Jఎన్నికల ప్రక్రియపై బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌంటింగ్కు ముందు రోజు రాత్రి విద్యుత్ సరఫరా నిలిపివేయడం, స్ట్రాంగ్ రూమ్ పగలగొట్టడం వంటి చర్యలు అధికార పార్టీ అండతోనే జరిగాయని వారు ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్ తీరును నిరసిస్తూ, క్రాస్ ఓటింగ్ జరిగిందనే అనుమానంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించి వాకౌట్ చేశారు. కాగా, బీజేపీకి చెందిన ఐదుగురు సభ్యులు ఈ ఎన్నికల ప్రక్రియకు పూర్తిగా దూరంగా ఉన్నారు.
సమావేశంలో 11వ వార్డు కౌన్సిలర్ జున్నోజు భాస్కర్.. చైర్పర్సన్ అభ్యర్థిగా రెంటాల సుహాసిని పేరును ప్రతిపాదించగా, వైస్ చైర్పర్సన్ అభ్యర్థిగా గూడూరు అంజలి పేరును తాళ్లపల్లి రమేష్ ప్రతిపాదించారు. సభ్యుల ఏకగ్రీవ మద్దతుతో వీరిద్దరి ఎన్నిక ఖరారైంది. అనంతరం ఎన్నికల అధికారి శ్రీధర్ వారికి నియామక పత్రాలను అందజేశారు. కమిషనర్ ముసాబ్ అహ్మద్ నూతన చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: Jagtial BJP: బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిపై సొంత పార్టీ కార్యకర్తలే దాడి.. కారణం ఏంటంటే.?