Bear Attacks: కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో గత వారం రోజులుగా ఎలుగుబంట్ల సంచారం స్థానిక ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా ఓబులవారిపల్లె, రైల్వేకోడూరు మండలాల్లో రెండు ఎలుగుబంట్లు తిరుగుతూ జనాలపై దాడులకు తెగబడుతుండటంతో అటవీ ప్రాంత గ్రామాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
వారం రోజుల క్రితం వై.కోట, బాల్రెడ్డిపల్లె గ్రామాల్లో ఎలుగుబంట్లు మొదటిసారిగా ప్రత్యక్షమయ్యాయి. ఈ క్రమంలో బాల్రెడ్డిపల్లెకు చెందిన అమర్నాథ్ రెడ్డి అనే యువకుడిపై ఒక ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటన తర్వాత అవి శేషాచలం అడవుల్లోకి వెళ్ళిపోయాయని భావించినప్పటికీ.. తాజాగా సోమవారం సాయంత్రం మళ్ళీ వై.కోట గ్రామ సమీపంలోని మామిడి తోటల్లో రైతులకు దర్శనమిచ్చాయి. అక్కడ పని చేసుకుంటున్న రైతులపై దాడికి ప్రయత్నించడంతో వారు ప్రాణభయంతో పరుగులు తీశారు.
వరుసగా దాడులు జరుగుతున్నా.. అటవీశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. వేసవి కాలం కావడంతో నీటి కోసం జంతువులు అడవి నుంచి గ్రామాల్లోకి వస్తాయని.. జాగ్రత్తగా ఉండాలని అధికారులు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు అధికారులు ఆయా గ్రామాలను సందర్శించి ఎలుగుబంట్లను బంధించేందుకు ఎటువంటి బోన్లు గానీ, నిఘా ఏర్పాటు గానీ చేయలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం తోటల్లో పనులు జరుగుతున్న సమయం కావడంతో.. ఎప్పుడు ఎటువైపు నుంచి ఎలుగుబంట్లు వస్తాయో తెలియక ప్రజలు భయం భయంగా గడుపుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఆ క్రూర మృగాలను అడవిలోకి పంపేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Also Read: కాంగ్రెస్కు జీవన్ రెడ్డి ‘షాక్’.. పార్టీలో కొనసాగడంపై పునరాలోచన.. ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు!