Ayyappa Devotees: తెలంగాణ పోలీస్ శాఖ అయ్యప్ప దీక్షలో ఉన్న ఉద్యోగుల పట్ల అనుసరిస్తున్న విధానం హిందూ భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉందని నిరసిస్తూ, అయ్యప్ప స్వాములు, బీజేవైఎం కార్యకర్తలు లక్డీకాపూల్లోని డీజీపీ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. డీజీపీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన స్వాములను, బీజేవైఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు.
అయ్యప్ప దీక్షలో ఉన్న ఎస్సైకి ఇచ్చిన మెమో వెనక్కి తీసుకోవాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ డిమాండ్ చేశారు. పోలీస్ శాఖ అయ్యప్ప స్వాములకు వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటనపై అడిషనల్ డీజీపీకి బీజేవైఎం నాయకులు, అయ్యప్పస్వాములు మెమోరాండం ఇచ్చారు. రేపటిలోగా ఎస్సైకి ఇచ్చిన మెమో ఉపసంహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్త నిరసనలు చేస్తామని బీజేవైఎస్ కార్యకర్తలు తెలిపారు.
‘రేపు వందలాది మంది స్వాములతో డీజీపీ ఆఫీస్ ముట్టడిస్తాము. ఇతర మతాలలో లేని ఆంక్షలు అయ్యప్ప స్వాములు మీద ఎందుకు, ఇతర మతం వాళ్లు గడ్డాలు పెంచుకొని డ్యూటీ చేయొచ్చు. పోలీసులు ఇఫ్తార్ విందులకు హాజరు కావచ్చు. కానీ అయ్యప్ప స్వాములు మాత్రం డ్యూటీ చేయకూడదా? పోలీస్ శాఖతో పాటు, అన్ని ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న అయ్యప్ప స్వాములపై ఆంక్షలు ఎత్తివేయాలి. సర్వీస్ రూల్స్ పేరుతో అయ్యప్ప స్వాములపై ఆంక్షలు పెట్టకూడదు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఆదేశాలు ఇవ్వాలి.
పోలీసు శాఖ అయ్యప్ప స్వాముల, హిందువుల మనోభావాలు దెబ్బతీసింది. వెంటనే పోలీసు శాఖ అయ్యప్ప స్వాములకి క్షమాపణలు చెప్పాలి. లేదంటే వేలాది మంది అయ్యప్ప స్వాములతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తాం’ – బీజేవైఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్
దీక్షలు తీసుకోవాలనుకునే వారు సెలవు పెట్టాలని హైదరాబాద్ నగర పోలీసుశాఖ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు అయ్యప్ప దీక్షలు వంటి మతాచారాలు పాటించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎవరైనా దీక్షలో ఉంటే సెలవులు పెట్టుకోవాలని సూచించింది. డ్యూటీలో ఉండి అయ్యప్పమాల ధరించిన కంచన్బాగ్ ఎస్ఐ కృష్ణకాంత్కు ఉన్నతాధికారులు మెమో జారీ చేశారు. మాల ధరించడం, గడ్డం పెంచడం, పోలీస్ బూట్లు లేకుండా విధి నిర్వహణపై వివరణ ఇవ్వాలని సౌత్ ఈస్ట్జోన్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ ఆదేశాలు జారీ చేశారు.
Also Read: Telangana High Court: అధికారం ఉందని రెచ్చిపోవద్దు.. హైడ్రాపై మరోసారి హైకోర్టు సీరియస్
మాల వేసుకోవాలకున్నవారు శాఖాపరంగా అనుమతి తీసుకోవాలని, రెండు నెలలపాటు సెలవులు మంజూరు చేస్తామని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. పోలీసులు గడ్డం, జుట్లు పెంచుకోవద్దని, తప్పనిసరిగా యూనిఫామ్ ధరించే విధులకు హాజరు కావాలని పేర్కొంది. పోలీసులు షూస్ ధరించకుండా సివిల్ దుస్తుల్లో విధులకు హాజరు కావద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం పోలీసుల్లో చాలా మంది అయ్యప్ప దీక్షలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పోలీసుశాఖ ఉత్తర్వులు వివాదాస్పందం అయ్యాయి. ఎస్సైకి మెమో జారీ చేయడంపై అయ్యప్పస్వాములు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.