Chakrapuri Colony: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చక్రపురి కాలనీ వాసులు తమ సమస్యను పరిష్కరించు కోవడంలో ప్రదర్శించిన చొరవ ఇతర కాలనీలకు ఆదర్శంగా నిలిచిందని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ ప్రశంసించారు. కేవలం ఫిర్యాదు చేసి వదిలేయకుండా.. సమస్య పరిష్కారానికి అవసరమైన పూర్తి ఆధారాలను, పత్రాలను సమర్పించి అధికారులకు సహకరించిన తీరు అభినందనీయమన్నారు. సోమవారం హైడ్రా ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో.. కమిషనర్ను అభినందించడానికి వచ్చిన కాలనీ వాసులను ఆయనే స్వయంగా సత్కరించడం విశేషం.
గత 20 ఏళ్లుగా చక్రపురి కాలనీ వాసులు భూకబ్జాల సమస్యతో సతమతమవుతున్నారు. అనేక కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో.. వారు హైడ్రా ‘ప్రజావాణి’లో ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన కమిషనర్ ఏవీ రంగనాథ్, స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు. 1985 నాటి లేఅవుట్ పత్రాలను , అవతలి పక్షం సమర్పించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ విచారణలో సుమారు 1253.8 గజాల పార్కు స్థలం కబ్జాకు గురైందని.. పక్కనే ఉన్న వ్యవసాయ భూమి యజమానులు కాలనీ లేఅవుట్లోకి చొచ్చుకు వచ్చి మూడున్నర ఎకరాల మేర పార్కులు, రహదారులు, ప్లాట్లను ఆక్రమించినట్లు నిర్ధారించారు.
నిజనిర్ధారణ జరిగిన వెంటనే హైడ్రా అధికారులు స్పందించి.. ఆక్రమణకు గురైన పార్కు స్థలానికి ఫెన్సింగ్ వేశారు. దీనివల్ల పార్కుతో పాటు రహదారుల సరిహద్దులపై స్పష్టత వచ్చింది. ఈ చర్యతో 30 ప్లాట్లు కబ్జా కోరల నుంచి విముక్తి పొందాయి. రెండు దశాబ్దాల పోరాటం ఫలించడంతో కాలనీ వాసుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఆపరేషన్లో స్థానికులతో సమన్వయం చేసుకున్న హైడ్రా ఇన్స్పెక్టర్ బాలగోపాల్ కృషిని కూడా కమిషనర్ ప్రత్యేకంగా కొనియాడారు.
బాచుపల్లి నుండి చక్రపురి కాలనీ మీదుగా అమీన్పూర్ వెళ్లే 200 అడుగుల ప్రధాన రహదారి కూడా ఇప్పుడు ఆక్రమణల నుండి క్లియర్ అయింది. వేలమంది ప్రయాణికులకు ఉపయోగపడే ఈ రహదారి నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులు త్వరితగతిన చేపట్టాలని కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రతి కాలనీ సంక్షేమ సంఘం ఇదే తరహాలో పక్కా ఆధారాలతో ముందుకు రావాలని కమిషనర్ సూచించారు.
Aslo Read: రైల్వేకోడూరులో ఎలుగుబంట్ల బీభత్సం.. జనంపై దాడులు.. ప్రాణభయంతో వణుకుతున్న గ్రామాలు!