Municipal Corporations: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని ప్రజలకు పౌర, అత్యవసర సేవలందించే మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో ఉద్యోగులను భారీగా ప్రక్షాళన చేసేందుకు అధికారులు రంగం సిద్దం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా గత గత ఫిబ్రవరి 11వ తేదీ నుంచి కోర్ అర్బన్ రీజియన్ లో మూడు మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి పౌర సేవల నిర్వహణను కొనసాగిస్తున్న సంగతి తెల్సిందే.
ఇష్టారాజ్యంగా బదిలీలు
మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటైన సమయంలో కనీసం ఉద్యోగులకు ఆప్షన్ కూడా ఇవ్వకుండా ఉద్యోగులను ఇష్టారాజ్యంగా బదిలీలు చేశారు. అయితే యూనియన్ల నుంచి ఆరోపణలు రావటం, దీనికి తోడు చాలా మంది ఉద్యోగులు విధి నిర్వహణ కోసం డైలీ సుమారు 70 నుంచి 80 కిలోమీటర్ల దూరం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. అయితే తాము చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని మూడు కార్పొరేషన్ల కమిషనర్లకు వినతులు రావటం, పైగా కోర్ అర్బన్ రీజియన్ లోనే అతి పెద్ద కార్పొరేషన్ అయిన జీహెచ్ఎంసీలోని కొన్ని సర్కిల్ కార్యాలయాల్లో ఉద్యోగులు ఏకంగా దశాబ్దాల నుంచి బదిలీల్లేకుండా ఒకే చోట విధులు నిర్వహిస్తున్నట్లు కూడా ఉన్నతాధికారులు గుర్తించారు.
ఇన్ టైమ్ లో విధులకు హాజరు
హయత్ నగర్ నుంచి కొందరు ఉద్యోగులు మూసాపేట సర్కిల్ కార్యాలయానికి డైలీ రాకపోకలు సాగిస్తున్నట్లు గుర్తించినట్లు తెలిసింది. మరి కొందరు ఏకంగా సంగారెడ్డి నుంచి సికిందరాబాద్, ఖైరతాబాద్ జోనల్ ఆఫీసుల్లో విధులకు హాజరవుతున్నట్లు కూడా గుర్తించారు. దీనికి తోడు ఒక కార్పొరేషన్ లో నివాసముంటున్న ఉద్యోగులు మరో కార్పొరేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నట్లు కూడా ఇటీవలే ఉద్యోగుల నుంచి వచ్చిన వినతులతో తేలిపోవటంతో ఉద్యోగులకు తాము విధులు నిర్వహిస్తున్న ప్లేస్ నుంచి నివాసానికి దూరం తగ్గించాలని, ఫలితంగా వారు ఇన్ టైమ్ లో విధులకు హాజరయ్యే అవకాశముంటుందని కూడా అధికారులు భావిస్తున్నారు.
ఉద్యోగుల బదిలీ..
ఒకే సారి మూడు కార్పొరేషన్లలో భారీగా ఉద్యోగులను బదిలీలు చేసేందుకు అధికారులు రంగం సిద్దం చేశారు. మూడు కార్పొరేషన్లలోని వివిధ విభాగాలకు చెందిన అధికారులు, కింది స్థాయి సిబ్బంది ఆధార్ కార్డుల్లో ఉన్న అడ్రస్ ను బట్టి వారికి సమీపంలోని ఆఫీసుల్లోకి బదిలీలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. మూడు కార్పొరేషన్లలో దాదాపు మూడు వేల మంది ఉద్యోగుల ఆధార్ కార్డులను సేకరించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది.
వింగ్ టూ వింగ్ బదిలీలు
దీనికి తోడు పదవీ విరమణకు దగ్గరలో ఉన్న ఉద్యోగుల వివరాలను కూడా సేకరించి, వారికి ఆప్షన్ ఇచ్చి బదిలీ చేయాలని అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది. తక్కువ సర్వీసు కల్గిన మహిళా ఉద్యోగులకు కొన్ని మినహాయింపులివ్వాలని కూడా భావిస్తున్నట్లు తెలిసింది. కారుణ్య నియామకాల్లో భాగంగా ఇటీవలే విధుల్లోకి చేరిన కొత్త ఉద్యోగుల వయస్సు, విద్యార్హతను బట్టి వారిని కూడా బదిలీలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. మూడు కార్పొరేషన్లలోని వివిధ రకాల వింగ్ ల పట్ల కొత్త ఉద్యోగులకు అవగాహన కలిగేందుకు వీలుగా వింగ్ టూ వింగ్ బదిలీలు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
లాంగ్ స్టాండింగ్ లకు చెక్
కోర్ అర్బన్ రీజియన్ లోని మూడు కార్పొరేషన్ల పరిధిలో అధికారులు త్వరలో చేపట్టనున్న ఉద్యోగుల మహా ప్రక్షాళనతో ఇప్పటి వరకు దశాబ్దాలుగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్న లాంగ్ స్టాండింగ్ లకు చెక్ పెట్టాలన్న ప్రధాన ఉద్దేశ్యంతోనే ఆధార్ కార్డుల్లోని అడ్రస్ ను బేస్ చేసుకుని బదిలీలు చేయాలని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. సికిందరాబాద్ జోన్ పరిధిలోని కాంట్రాక్టర్ల పనుల బిల్లింగ్ వింగ్ లో ఇద్దరు మహిళా ఉద్యోగులు దశాబ్దాలుగా విధులు నిర్వహిస్తున్నట్లు, అలాగే సైదాబాద్ ఏరియాలో కూడా ఓ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ ఏకంగా 16 ఏళ్ల నుంచి బదిలీల్లేకుండా విధులు నిర్వహిస్తున్నట్లు కూడా గుర్తించినట్లు తెలిసింది.
లాంగ్ స్టాండింగ్ లకు చెక్
ఉన్నతాధికారులు త్వరలో చేపట్టనున్న ప్రక్షాళనతో ఇలాంటి లాంగ్ స్టాండింగ్ లకు చెక్ పెట్టే అవకాశముంది. దీనికి తోడు వార్డు, సర్కిల్ ఆఫీసుల్లో చాలా మంది మూడు, నాలుగో తరగతి ఉద్యోగులు వారు అపాయింట్ మెంట్ అయిన చోటే దాదాపు దశాబ్దాలుగా విధులు నిర్వహిస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఇలాంటి ఉద్యోగులు వందల సంఖ్యలో ఉంటారని కూడా ఓ అంచనా ఉంది. అలాగే జీహెచ్ఎంసీలో విధులు నిర్వర్తించి, రిటైర్డు అయినా, ఇంకా కొనసాగుతున్న ఉద్యోగులను కూడా అధికారులు గుర్తించి, వారిని ఇంటికి పంపించాలని భావిస్తున్నట్లు తెలిసింది.
Also Read: సిద్దిపేట జిల్లాలో విషాదం.. హల్ది వాగులో ఈతకు దిగి ముగ్గురు మృతి..