భాగ్య నగరంలో సైబర్ నేరగాళ్లు మరోసారి పంజా విసిరారు. ఈసారి ఏకంగా మాజీ డీజీపీ మనుమరాలు.. సుమారు 18 కంపెనీలకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్న దొడ్ల దివ్యారెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. అత్యంత చాకచక్యంగా ఆమె పేరుతోనే వాట్సప్ డీపీని సృష్టించి.. ఆమె అకౌంటెంట్ను బురిడీ కొట్టించారు. కేవలం మెసేజ్ల ద్వారానే ఏకంగా రూ. 1.20 కోట్ల రూపాయలను కాజేశారు.
బాధితురాలు దొడ్ల దివ్యారెడ్డి ఒక ప్రముఖ వ్యాపారవేత్త. ఆమె దగ్గర పని చేసే అకౌంటెంట్కు అపరిచిత నంబర్ నుండి ఒక వాట్సప్ మెసేజ్ వచ్చింది. ఆ నంబర్కు దివ్యారెడ్డి ఫోటో ప్రొఫైల్ పిక్చర్గా ఉండటంతో అకౌంటెంట్ అది నిజంగానే తన యజమాని పంపిన సందేశమని భ్రమపడ్డారు. తాను ప్రస్తుతం ఒక ముఖ్యమైన సమావేశంలో ఉన్నానని.. అత్యవసరంగా కొంత నగదు బదిలీ చేయాలని ఆ మెసేజ్ సారాంశం. ఫోన్ కాల్స్ చేయవద్దని.. కేవలం చాటింగ్ ద్వారానే సూచనలు ఇస్తున్నట్లు నేరగాడు నమ్మించాడు.
నేరగాడు పంపిన బ్యాంకు ఖాతా వివరాలను చూసిన అకౌంటెంట్.. తన యజమాని ఆదేశం మేరకు వెంటనే రూ. 1.20 కోట్లను ఆ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేశాడు. కాసేపటి తర్వాత అసలు విషయం తెలుసుకున్న అకౌంటెంట్ షాక్కు గురయ్యాడు. దివ్యారెడ్డిని సంప్రదించగా తాను ఎలాంటి మెసేజ్ చేయలేదని ఆమె స్పష్టం చేశారు. దీంతో తాము సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకున్నామని గ్రహించిన బాధితులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు.
ఈ ఘటనపై సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు నమోదైంది. సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడు ఎక్కడి నుండి సందేశం పంపాడు.. నగదు ఏ బ్యాంకు ఖాతాలోకి వెళ్లిందనే కోణంలో అధికారులు విచారణ వేగవంతం చేశారు. ప్రముఖుల ఫోటోలను వాడి వాట్సప్ ద్వారా జరిగే ఇలాంటి మోసాల పట్ల ప్రజలు.. ముఖ్యంగా అకౌంటెంట్లు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరైనా పెద్ద మొత్తంలో డబ్బు అడిగినప్పుడు నేరుగా ఫోన్ చేసి ధృవీకరించుకోవాలని హెచ్చరిస్తున్నారు.
ALSO READ: Congress Party: కాంగ్రెస్లో పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏప్రిల్ టార్గెట్గా హైకమాండ్ ప్లాన్!