Ebola Alert: హైదరాబాద్లో ఇటీవల ఎబోలా వైరస్ కలకలం సృష్టించింది. విమానాశ్రయంలో నిర్వహించిన తనిఖీల్లో సూడాన్ దేశస్తుడికి ఎబోలా లక్షణాలు ఉన్నట్లు అనుమానించడం కాస్త ఆందోళనకు గురిచేసింది. అయితే, ఈ కేసుపై తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజా నరసింహ ఊరటనిచ్చే ప్రకటన చేశారు.
సూడాన్ జాతీయుడికి నెగటివ్
జూన్ 4వ తేదీ తెల్లవారుజామున ఇథియోపియా నుండి హైదరాబాద్ చేరుకున్న 35 ఏళ్ల సూడాన్ జాతీయుడికి విమానాశ్రయం థర్మల్ స్క్రీనింగ్లో జ్వరం ఉన్నట్లు తేలింది. అతనికి ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో ప్రయాణించిన చరిత్ర ఉండటంతో అధికారులు అప్రమత్తమై గాంధీ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డుకు తరలించారు. మోకాలి శస్త్రచికిత్స కోసం నగరానికి వచ్చిన ఈ వ్యక్తి నమూనాలను పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)కి పంపగా, ఎబోలా నెగటివ్ అని తేలింది.
మరో అనుమానిత కేసు
ఇదే సమయంలో, 20 ఏళ్ల వయసున్న మరో సూడాన్ జాతీయుడిని కూడా ఒక ప్రైవేట్ ఆసుపత్రి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ రెండో ప్రయాణికుడి నమూనాలను కూడా పరీక్షల కోసం పంపగా, దీని ఫలితాలు శనివారం నాటికి వస్తాయని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి తెలిపారు. మొదటి వ్యక్తికి నెగటివ్ వచ్చినప్పటికీ, జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (NCDC) మార్గదర్శకాల ప్రకారం వారిని ఇంకా డిశ్చార్జ్ చేయలేదు.
ఎయిర్పోర్టులో ముమ్మర తనిఖీలు
ఎబోలా వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కఠినమైన నిఘా ఏర్పాటు చేశారు. ఉగాండా, కాంగో వంటి ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుండి వచ్చే వారు విమానం దిగడానికి ముందే స్వీయ-ప్రకటన పత్రం (SDF) సమర్పించాల్సి ఉంటుంది. లక్షణాలు ఉన్నవారిని నేరుగా గాంధీ ఆసుపత్రికి పంపుతుండగా, లక్షణాలు లేని ప్రయాణికులను 21 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు.
అసలు ఎబోలా అంటే ఏమిటి?
ఎబోలా అనేది మనుషులతో పాటు జంతువులకు కూడా సోకే అత్యంత ప్రమాదకరమైన వైరస్. ఆకస్మిక జ్వరం, తీవ్రమైన నీరసం, కండరాల నొప్పులు దీని ప్రాథమిక లక్షణాలు. ఇది ముదిరితే అంతర్గత రక్తస్రావం, అవయవాల వైఫల్యానికి దారితీస్తుంది. సోకిన అడవి జంతువుల (గబ్బిలాలు, ముళ్ళపందులు) ద్వారా ఇది మనుషులకు వ్యాపిస్తుంది. ఒకరి నుంచి మరొకరికి శరీర ద్రవాలు లేదా కలుషితమైన బట్టలు, పరుపుల ద్వారా ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ప్రస్తుతం నగరంలో పరిస్థితి అదుపులోనే ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
Also Read: నీట్ పరీక్ష రద్దు వెనుక అసలు నిజాలివే.. కేంద్రంపై విరుచుకుపడ్డ మహేష్ కుమార్ గౌడ్!