Kavitha Criticism: తెలంగాణ అనడాన్ని ప్రాంతీయ ఉగ్రవాదంతో పోల్చడాన్ని కల్వకుంట్ల కవిత తప్పుబట్టారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పరోక్షంగా చురకలు అంటించారు. తమ మేధావులు, కళాకారులను అవమానిస్తున్నారని పవన్ పై విరుచుకుపడ్డారు. మీరు కొనుక్కునే భూములు, కార్లు కూడా తమ తెలంగాణ ప్రజల కొన్న టికెట్ల ద్వారా వచ్చినవే అని గుర్తుచేశారు. గద్దర్ కు కారు కొనిచ్చానని చెబుతూ ఆయన్ను పవన్ కళ్యాణ్ అవమానించారని కవిత ఆరోపించారు. ‘మీరు కళాకారుడిగా ఉంటూ మరొక కళాకారుడిని అవమానిస్తారా?’ అంటూ పవన్ ప్రశ్నించారు.
కుడిచేత్తో చేసే దానం ఎడమ చేతికి తెలియనివ్వద్దని అంటారని.. కానీ ఎప్పుడో కొని ఇచ్చిన కారు గురించి ఇప్పుడు చెబుతారా? అంటూ పవన్ పై కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జానపద కళాకారుల ట్యూన్స్ వాడుకొని వాళ్లకు రాయల్టీ ఇచ్చారా? చిన్న కళాకారులను ఆదుకున్నారా? తెలంగాణ వచ్చిన తర్వాత కూడా సమైక్యవాదులు దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆంధ్రా విష కోరల్లో నుంచి తెలంగాణ సాధించుకున్నాం. కచ్చితంగా తెలంగాణ మా జాగీరే. రాజ్యాంగపరంగా ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు. కానీ నైతికత అనేది ఉంటుంది. మా హక్కులు, వనరులను దోచుకున్న మీ మీద పోరాటం చేసి తెలంగాణ సాధించుకుంటే మళ్లీ మీ రాజకీయం ఇక్కడ ఎందుకు?. మేము వద్దంటే వన్ సైడ్ లవ్ అంటూ బలవంతం చేస్తూ యాసిడ్ పోస్తామంటే ఎలా?’ అని కవిత నిలదీశారు.
ముందు ఆంధ్రా ప్రజలకు మేలు చేయాలని పవన్ కు కవిత సూచించారు. తమ పాలనను తాము చూసుకోగలమని స్పష్టం చేశారు. బీజేపీకి ఇక్కడ లీడర్ లేక పవన్ కళ్యాణ్ తో రెండు ఓట్లు తెచ్చుకుందామనుకుంటుందోని కవిత అన్నారు. పంజాబ్ లో మొత్తం ధాన్యం కొంటున్న కేంద్రం ఇక్కడ మాత్రం ఎందుకు పరిమితులు విధిస్తోందని ప్రశ్నించారు. ‘దానిపై బీజేపీ ఎంపీలు ఎందుకు ప్రశ్నించరు? వచ్చే సరి ఎనిమిది మంది కాదు కదా ఒక్క ఎంపీ కూడా గెలవరు?’ అని ఛాలెంజ్ చేశారు. మరోవైపు పాలమూరు బిడ్డ అయి ఉండి ఈ ముఖ్యమంత్రి 30 నెలలుగా పాలమూరు ప్రాజెక్ట్ పై రివ్యూ చేయలేదని కవిత విమర్శించారు. మేము వెంటబడి ధర్నాలు, ఆందోళనలు చేస్తే ఫస్ట్ టైమ్ రివ్యూ చేశారని పేర్కొన్నారు. కానీ ఆంధ్రాకు 260 టీఎంసీలు నీళ్లు తీసుకోండి అని చెబుతున్నారని మండిపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డికి నీటి మీద అవగాహన లేదని కవిత విమర్శించారు. ఆ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ పెంచుకునే ప్రయత్నం చేయాలని హితవు పలికారు. గతంలో తుమ్మడి హెట్టి ని అంగీకరించని మహారాష్ట్ర సీఎం వద్దకు వెళ్లి ఏదో చేస్తాననే భ్రమలు కల్పిస్తున్నారని మండిపడ్డారు. పక్క రాష్ట్రంలో ఉన్న తన గురువైన ముఖ్యమంత్రిని మాత్రం కలవటం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడిని కలిసి 200 టీఎంసీలు మనకు ఇవ్వాలని రేవంత్ డిమాండ్ చేయాలని కవిత సూచించారు. ఒకవేళ బనకచర్లకు రేవంత్ అంగీకరిస్తే తెలంగాణకు నీటి ద్రోహం చేసినట్లేనని తేల్చిచెప్పారు. సీఎం రేవంత్.. కాంగ్రెస్ పార్టీని 20 ఏళ్లు బొంద పెట్టే పనులు చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read: రూ. లక్ష కోట్ల భూములు దోచేస్తున్నారు.. కాంగ్రెస్కు ఇదే ఆఖరి సర్కార్.. కవిత తీవ్ర ఆగ్రహం
భవిష్యత్ లో తెలంగాణకు కృష్ణా నీళ్లు సరిపోవన్న కవిత.. గోదావరిలో 200 టీఎంసీలు నీళ్లు డిమాండ్ చేయాలని రేవంత్ కు సూచించారు. లేదంటే తెలంగాణకు నీటి విషయంలో ద్రోహం చేసిన వాళ్లు అవుతారని మరోమారు హెచ్చరించారు. మరోవైపు ఉద్యమకారులను గుర్తించే అఖిలపక్ష సమావేశానికి తమని పిలవకపోవటాన్ని వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నట్లు కవిత అన్నారు. ‘ఉద్యమకారులకు కచ్చితంగా భూమి ఇవ్వాల్సిందే. దాని కోసం ఉప్పల్ భగాయత్ లో వచ్చే నెల పోరాటం చేయబోతున్నాం. నాదర్ గుల్ లో ఉన్న రెండు వందల ఎకరాల భూమిని కూడా ఉద్యమకారులకు ఇవ్వాలి’ అని కవిత డిమాండ్ చేశారు.