Mahesh Kumar Goud: టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ లిబర్టీ సర్కిల్ వద్ద కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నీట్ పరిక్ష రద్దు, విద్యార్ధుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతుందని కేంద్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం
నీట్-యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో పరీక్షను రద్దు చేయడం కేంద్ర ప్రభుత్వ చేతగానితనానికి, వైఫల్యానికి నిదర్శనమని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు నెలల తరబడి రాత్రింబవళ్లు కష్టపడి చదివితే, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వారి శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరైందని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది కుటుంబాల భవిష్యత్తును రోడ్డున పడేసినందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిసెంబర్ డిమాండ్ చేశారు. ఈ సంక్షోభంలో నష్టపోయిన విద్యార్థుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
దేశ రక్షణలో వైఫల్యం
కేంద్ర ప్రభుత్వ ఉదాసీనత కేవలం విద్యా వ్యవస్థకే పరిమితం కాలేదని, దేశ రక్షణలోనూ స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. చైనా వారు దేశ సరిహద్దుల్లోకి చొచ్చుకు వస్తున్నా కేంద్రం చేష్టలుడిగి చూస్తోందని, ఇది వారి చేతగానితనానికి పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిగ్గా ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తికాగానే కేంద్ర ప్రభుత్వం తన అసలు స్వరూపాన్ని బయటపెట్టిందని మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. ఎన్నికలు ముగిసిన వెంటనే సామాన్యుడిపై భారం మోపుతూ ఎల్పీజీ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను విచ్చలవిడిగా పెంచేసిందని మండిపడ్డారు.
తెలంగాణలో ప్రజా పాలన
కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంటే, తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం అందుకు భిన్నంగా పనిచేస్తోందని ప్రశంసించారు. రాష్ట్రంలో విద్యా, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి, పేదలకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు.
Also Read:అమెరికాలో భారతీయుల శకం ముగిసిందా? టెకీలను వెంటాడుతున్న కొత్త భయాలు!