భాగ్యనగరంలో డ్రగ్స్ నెట్వర్క్పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో తాజాగా భారీ డ్రగ్ ముఠా గుట్టును ఈగల్ టీమ్.. గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా రట్టు చేశారు. కొండాపూర్ ప్రాంతంలోని వెంకటరమణ రెసిడెన్సీ అపార్ట్మెంట్పై ఖచ్చితమైన సమాచారంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ప్రధాన నిందితుడు మురళీ కృష్ణం రాజుతో పాటు అతనికి సహకరిస్తున్న చిరంజీవి వర్మ.. హేమంత్ రాజులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి సుమారు 32 గ్రాముల ఖరీదైన కొకైన్ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
మురళీ కృష్ణం రాజు అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్గా చలామణి అవుతున్నాడు. జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించే క్రమంలో ఈ డ్రగ్స్ వ్యాపారంలోకి దిగాడు. బెంగళూరు.. గోవా వంటి ప్రాంతాల నుండి నిందితులు మత్తు పదార్థాలను కొనుగోలు చేస్తున్నారు. బెంగళూరులో ఉన్న తన స్నేహితుడి ద్వారా బస్సుల్లో డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులు ఎంతో తెలివిగా పోలీసుల కళ్లు గప్పి ఈ దందాను కొనసాగిస్తున్నారు.
ఈ ముఠా తమ కార్యకలాపాల కోసం ఆధునిక సాంకేతికతను వాడుతోంది. కస్టమర్లతో నేరుగా ఫోన్ కాల్స్ మాట్లాడకుండా కేవలం వైఫై (Wi-Fi) ఆధారిత వాట్సాప్ కాల్స్.. మెసేజ్ల ద్వారానే సంప్రదింపులు జరుపుతున్నారు. డ్రగ్స్ డెలివరీ కోసం వీరు “డెడ్ డ్రాప్” పద్ధతిని అనుసరిస్తున్నారు. దీనివల్ల కొనేవారు.. అమ్మేవారు ముఖాముఖి కలుసుకోవాల్సిన అవసరం ఉండదు. డబ్బు చెల్లింపుల విషయంలో కూడా నిందితులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమ స్వంత ఖాతాలను కాకుండా స్నేహితుల బ్యాంక్ ఖాతాలను వాడుతూ ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు.
గచ్చిబౌలి పోలీసులు.. ఈగల్ టీమ్ సమన్వయంతో నిర్వహించిన ఈ ఆపరేషన్ డ్రగ్ ముఠాకు గట్టి దెబ్బ కొట్టింది. నిందితులను రిమాండ్కు తరలించిన పోలీసులు.. ఈ నెట్వర్క్తో సంబంధం ఉన్న మిగిలిన వారి కోసం ఆరా తీస్తున్నారు. ఐటీ కారిడార్ పరిసరాల్లో డ్రగ్స్ సరఫరాపై నిఘా మరింత పెంచినట్లు సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. యువత మత్తుకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని వారు హెచ్చరిస్తున్నారు.
ALSO READ: Jagtial BJP: బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిపై సొంత పార్టీ కార్యకర్తలే దాడి.. కారణం ఏంటంటే.?