Jeevan Reddy: తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి , ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా జగిత్యాల జిల్లా రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలు ఆయన్ను తీవ్ర అసంతృప్తికి గురిచేశాయి. పార్టీ ఫిరాయింపులు, స్థానిక నాయకత్వ ప్రాధాన్యతపై ఆయన సంధించిన ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండా మోస్తున్న తనకు.. ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్ర అవమానాలు ఎదురవుతున్నాయని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై పునరాలోచనలో ఉన్నాను’ అని ప్రకటించడం ద్వారా ఆయన తన అసహనాన్ని బాహాటంగా ప్రదర్శించారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల మనోభావాలను అధిష్టానం పట్టించుకోవడం లేదని.. భవిష్యత్తు ఏంటో అర్థం కావడం లేదని ఆయన పేర్కొన్నారు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు ప్రాధాన్యత ఇవ్వడంపై జీవన్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. పవర్ ఆఫ్ అటార్నీ జగిత్యాల కాంగ్రెస్ బాధ్యతలను సంజయ్కు రాసిచ్చారా? అని ప్రశ్నించారు. స్పీకర్ ఏమో ఎమ్మెల్యే పార్టీ మారలేదని అంటారు, కానీ ఆయన కాంగ్రెస్తోనే సంసారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సంజయ్ ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం తనకు, తన అనుచరులకు వేధింపులు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు.
జగిత్యాలలోనే పరిస్థితి ఇలా ఉంటే.. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు చేరిన మిగిలిన 9 నియోజకవర్గాల్లో పాత కాంగ్రెస్ నేతల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అని ఆయన ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల వల్ల ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న క్యాడర్ కుప్పకూలిపోతోందని హెచ్చరించారు. జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద సవాలుగా మారింది. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే ఆయన.. పార్టీని వీడే ఆలోచనలో ఉన్నాననడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.
Also Read: HCUలో భారీ ల్యాప్టాప్ల చోరీలో షాకింగ్ ట్విస్ట్.. విద్యార్థులే దొంగలు!
మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై ఆలోచిస్తున్నా
ఇంకెంత కాలం అవమానాలు భరించాలి?
ఎమ్మెల్యేగా సంజయ్ ఉన్నంత కాలం నాకు వేధింపులు తప్పవు
జగిత్యాలలోనే ఇలా ఉంటే పార్టీ మారిన మరో 9 ప్రాంతాల్లో ఎలా ఉందో?
– మాజీ మంత్రి జీవన్ రెడ్డి pic.twitter.com/3LlCW9Ia3K
— BIG TV Breaking News (@bigtvtelugu) February 16, 2026