H-City Project: మహానగరంలో రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య నుంచి ఊరట కల్గించేందుకు సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన హెచ్ సిటీ పనుల పరిస్థితి దినదిన గండం నూరేళ్లు ఆయుశ్శు అన్నట్టు తయారైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిటీలో అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్ లోని కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టి, సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు గత గులాబీ సర్కారు ప్రతిపాదించిన హెచ్ సిటీ పనులకు ప్రతిపాదనల స్థాయి నుంచే అడ్డంకులు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో సర్కారు మారినా హెచ్ సిటీ పనులు పట్టాలెక్కకపోవటం ప్రస్తుతం జీహెచ్ఎంసీలో హాట్ టాపిక్ గా మారింది. కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ నివారణ కోసం ఏడు స్టీల్ ఫ్లై ఓవర్లు, మరో ఏడు అండర్ పాస్ లను నిర్మించేందుకు సర్కారు కూడా పరిపాలనపరమైన మంజూరీ ఇచ్చింది.
ప్రాజెక్టుల నిర్మాణం, యుటిలిటీల బదలాయింపుకు కలుపుకుని మొత్తం వ్యయం రూ, 1090 కోట్లు కాగా, ఒక్క కేబీఆర్ పార్కు చుట్టూ ఆరు జంక్షన్ల వద్ద చేయాల్సిన స్థల సేకరణతో పాటు ఇతర ప్రాంతాలైన విరంచి హాస్పిటల్, ఎన్ఎఫీ సీ, టీవీ 9 జంక్షన్లతో కలుపుకుని కేవలం స్థల సేకరణకు రూ. 1543.82 కోట్ల వరకు ఖర్చవుతున్నట్లు అధికారులు లెక్కలేశారు. కానీ జీహెచ్ఎంసీ వద్ద అంత పెద్ద ఎత్తున వెచ్చించేందుకు నిధులు లేవు. స్థల సేకరణకు ప్రత్యేకంగా సర్కారు నిధులు కేటాయిస్తే తప్పా, స్థల సేకరణ సాధ్యమయ్యేలా లేదని తెలిసింది.
హెచ్ సిటీ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు పార్కు చుట్టూ మొత్తం పది ప్రాంతాల్లో స్థలాన్ని సేకరించాల్సి ఉంది. ఇప్పటికే మార్కింగ్ కూడా పూర్తయినా, ఆశించిన స్థాయిలో స్థల సేకరణ ప్రక్రియ పూర్తి కాలేదు. పార్కు చుట్టూ కొందరు సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖలకు చెందిన ఆస్తుల నుంచి స్థలాన్ని సేకరించాల్సి ఉంది. కేబీఆర్ చుట్టూ జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన స్థల సేకరణ ప్రక్రియను సవాలు చేస్తూ ముగ్గురు వ్యక్తులు కోర్టును కూడా ఆశ్రయించినట్లు సమాచారం. పార్కు చుట్టూ చేపట్టాల్సిన పనులకు గతంలోనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసిన అధికారులకు సర్కారు నుంచి అనుమతి కూడా లభించినా, హెచ్ సిటీ పనులు ముందుకు సాగటం లేదు. స్థల సేకరణకు న్యాయపరమైన చిక్కులు ఏర్పడటంతో కోర్టు పరిధిలో లేని ప్రాంతంలో పనులు మొదలు పెట్టాలని కమిషనర్ ఆర్.వి. కర్ణన్ కొద్ది నెలల క్రితం ఆదేశించినా, పనులు ఇంకా సర్వేలు, భూసార పరీక్షల స్థాయిలోన కొనసాగుతున్నాయి.
Also Read: Kaleshwaram Loans: కాళేశ్వరం ప్రాజెక్ట్.. వడ్డీలకే వేల కోట్లు, ఆరేళ్లలో రూ.72,766 కోట్ల చెల్లింపులు
గత సర్కారు హయాం నుంచి సుమారు పదకొండేళ్ల నుంచి రకరకాలుగా అడ్డంకులెదురవుతున్న కేబీఆర్ పార్కు చుట్టూ హెచ్ సిటీ పనులకు సంబంధించి స్థల సేకరణకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ చేసిన ప్రయత్నం కూడా ఫలితాలనివ్వలేదు. మాజీ మంత్రి, అధికార పార్టీ నేత జానా రెడ్డి కి చెందిన ఆస్తి నుంచి ఈ ప్రాజెక్టు పనులకు స్థలాలను సేకరించాల్సి ఉంది. ఇందుకు సంప్రదించి నేరుగా కమిషనర్ కర్ణన్ జానారెడ్డితో సంప్రదింపులు జరిపినా, నేటికీ స్థల సేకరణపై క్లారిటీ రాలేదు. ఇతర సినీ ప్రముఖులకు చెందిన ఆస్తుల నుంచి కొంత వరకు స్థలాలను సేకరించినా, వాటికి సంబంధించి స్థల యజమానులకు ఎలాంటి అభ్యంతరాల్లేకపోయినా, ప్రైవేటు వ్యక్తులు కోర్టును ఆశ్రయించటం కూడా ఓ సమస్యగా మారినట్లు తెలిసింది.
జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఆర్.వి. కర్ణన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత హెచ్ సిటీ పనులపై కమిషనర్ ఇప్పటి వరకు పలు సార్లు క్షేత్ర స్థాయిలో పరిశీలనలు జరపటంతో పాటు ప్రతి మంగళవారం ప్రధాన కార్యాలయంలో సమీక్షలు కూడా నిర్వహిస్తున్నా, క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించేందుకు ఈ ప్రయత్నాలేమీ ఫలితాలనివ్వటం లేదు.