తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కాళేశ్వరం ఎత్తిపోతల పథకం రుణాల భారం పెను సవాలుగా మారింది. గత ప్రభుత్వం చేసిన భారీ అప్పులు ఇప్పుడు రాష్ట్ర ఖజానాకు గుదిబండగా మారాయి. తాజాగా సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా వెలుగులోకి వచ్చిన గణాంకాలు రాష్ట్ర ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నాయి. గత ఆరేళ్ల కాలంలో ఈ ప్రాజెక్టు కోసం తీసుకున్న రుణాలకు సంబంధించి ప్రభుత్వం మొత్తం 72,766 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించింది. ఇందులో ఎక్కవ భాగం ప్రస్తుత రేవంత్ సర్కార్ హయాంలోనే జరిగింది.
గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో అడ్డగోలుగా చేసిన అప్పులను తీర్చే బాధ్యత ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి భుజస్కంధాలపై పడింది. 2020 నుంచి రుణ చెల్లింపుల సరళిని ఒక్కసారిగా క్లియర్ కట్ గా పరిశీలిస్తే ఏడాదికి ఏడాది ఈ భారం పెరుగుతూనే ఉంది. 2020లో కేవలం రూ. 1,487.98 కోట్లుగా ఉన్న వార్షిక చెల్లింపులు.. 2024 నాటికి రూ. 13,388.71 కోట్లకు చేరాయి. అంటే ఏ రేంజ్ లో రుణాల చెల్లింపు జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. అయితే 2025 సంవత్సరానికి వచ్చే సరికి ఇది రికార్డు స్థాయిలో రూ. 33,574.11 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ కావడం గమనార్హం.
వడ్డీల రూపంలోనే రాష్ట్ర సంపద భారీగా బయటకు వెళ్తోంది. కేవలం 2026 జనవరి నెలలోనే వివిధ బ్యాంకులకు కలిపి సుమారు రూ. 417.34 కోట్లు కేవలం వడ్డీల కోసమే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించింది. పీఎన్బీ కన్సార్టియంకు రూ. 77.69 కోట్లు , యూబీఐ కన్సార్టియంకు రూ. 51.24 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ. 15.00 కోట్లు, పీఎఫ్సీకి అత్యధికంగా రూ. 273.41 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. ప్రతి నెలా వందల కోట్ల రూపాయలు వడ్డీలకే పోతుండటం వల్ల ఇతర సంక్షేమ పథకాలు – అభివృద్ధి పనులపై దీని ప్రభావం పడుతోంది.
ఈ గణాంకాలపై సోషల్ మీడియా వేదికగా రాజకీయ రచ్చ షురూ అయ్యింది. కేసీఆర్ ప్రభుత్వం పద్ధతి పాడు లేకుండా చేసిన అప్పుల వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యిందని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు విమర్శిస్తున్నాయి. గత ప్రభుత్వం మిగిల్చిన అప్పుల మూటను మోస్తూనే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని రేవంత్ రెడ్డి గాడిలో పెడుతున్నారని పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. అప్పుల ఊబి నుంచి తెలంగాణను గట్టెక్కించేందుకు ప్రభుత్వం కఠినమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రుణ భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా భారీగా నిధులు విడుదల చేస్తోంది.
ALSO READ: Ramakrishna Reddy: 2500 కోట్ల అవినీతి.. చంద్రబాబు, పవన్పై ఆర్కే సంచలన వ్యాఖ్యలు!