భాగ్యనగరంలోని అత్యంత సంపన్న ప్రాంతమైన జూబ్లీహిల్స్లో కలకలం సృష్టించిన భారీ దోపిడీ కేసును హైదరాబాద్ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. సుమారు రూ. 1.3 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలను దోచుకెళ్లిన అంతరాష్ట్ర నేపాల్ ముఠాను జూబ్లీహిల్స్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్త ఆపరేషన్లో అరెస్ట్ చేశారు. ఈ ముఠాలోని ఐదుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి నుంచి భారీగా సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
పథకం ప్రకారం ప్రవేశం.. మత్తుమందుతో దోపిడీ..
ఈ దోపిడీ వెనుక అత్యంత పక్కా ప్లాన్ ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులు తొలుత పథకం ప్రకారం ఒక మహిళను సదరు బాధితుల ఇంట్లో పనిమనిషిగా చేర్పించారు. యజమానుల నమ్మకాన్ని గెలుచుకున్న ఆ మహిళ, దొంగల ముఠాకు ఇంటి గుట్టునంతా చేరవేసింది. దోపిడీ జరిగిన రోజున, ఇంట్లో ఉన్న వాచ్మన్కు, వంటమనిషికి ఆహారంలో మత్తుమందు కలిపి ఇచ్చి వారు స్పృహ కోల్పోయేలా చేసింది. అనంతరం తన ముఠా సభ్యులను లోపలికి పిలిపించి, బీరువాలో ఉన్న కోట్లాది రూపాయల విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలను ఊడ్చేశారు.
నిజాంపేట్లో కుట్ర.. నేపాల్కు చెక్కేస్తుండగా అరెస్ట్..
ఈ దోపిడీకి పాల్పడటానికి ముందు నిందితులంతా హైదరాబాద్లోని నిజాంపేట్ ప్రాంతంలో సమావేశమై వ్యూహరచన చేసినట్లు పోలీసులు గుర్తించారు. దోపిడీ అనంతరం పోలీసుల కళ్లు గప్పి నేపాల్కు పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించారు. అయితే, సాంకేతిక పరిజ్ఞానం మరియు పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, నిందితులను సరిహద్దులు దాటకముందే పట్టుకున్నారు. నిందితుల నుంచి దొంగిలించిన ఆభరణాలతో పాటు సెల్ఫోన్లు, వారు వాడిన బైకులను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన నిందితుల వివరాలు ఇవే..
పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో 1. రమేష్ బహదూర్ చంద్, 2. జనక్ కుమార్ బిక్రమ్ షాహి, 3. లలిత్ బహదూర్ చంద్, 4. మదన్ ఖత్రి, 5. బోహర సుశీల్ ఉన్నారు. వీరంతా నేపాల్కు చెందిన వారని, హైదరాబాద్లోని సంపన్న గృహాలే లక్ష్యంగా వీరు దాడులకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులుగా భావిస్తున్న మరికొందరు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఉన్నతాధికారులు వెల్లడించారు.
నగరవాసులకు పోలీసుల హెచ్చరికలు..
హైదరాబాద్లో ఇటీవల నేపాల్ ముఠాలు పనిమనుషుల అవతారమెత్తి దోపిడీలకు పాల్పడుతుండటంపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంట్లో పనిమనుషులను గానీ, వాచ్మన్లను గానీ నియమించుకునేటప్పుడు వారి పూర్తి వివరాలు, ఆధార్ కార్డులు సేకరించాలని.. స్థానిక పోలీస్ స్టేషన్లో వారి సమాచారాన్ని సమర్పించాలని (Police Verification) సూచించారు. అరెస్టయిన నిందితులను జ్యుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ALSO READ: Mahashivratri Fasting: మహాశివరాత్రి ఉపవాసం.. కొత్తగా చేసేవారు చేయకూడని పొరపాట్లు ఇవే