Jaya Bachchan Vs Nirmala Sitharaman:కేంద్ర బడ్జెట్లో సినిమా టిక్కెట్లపై పన్ను విధించడం, వినోద పరిశ్రమను నిర్లక్ష్యం చేయడంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఎంపీ జయా బచ్చన్ రాజ్యసభలో మాటల యుద్ధం జరిగింది. సీతారామన్ వివరణను నమ్మశక్యంగా లేదన్న జయా బచ్చన్.. “మీరు గొప్ప కథకురాలు” అని అన్నారు. దీంతో సీతారామన్ సహనం కోల్పోయి..”మీకు మాత్రమే గొంతులేదు” అని అన్నారు. మాకు కూడా నోరు ఉందని, మేము ఇంకా గట్టిగా మాట్లాడగలమనే ఉద్దేశంతో మాట్లాడారు.
బడ్జెట్ లో ఎంటర్టైన్మెంట్ కు కేటాయింపులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన సమాధానంపై మాట్లాడుతూ.. రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్ మంత్రి “గొప్ప కథకురాలు” అంటూ ఎద్దేవా చేశారు. టికెట్ ధరలు పెరగడానికి కారణమైన పన్నులపై ప్రశ్నలు లేవనెత్తారు. “ఆర్థికమంత్రి చాలా మంచి సమాధానాలు ఇచ్చారు. మీరు గొప్ప స్టోరీ టెల్లర్. మాకు గొప్ప వినోదం. మేము ఎంటర్ టైన్మెంట్ పరిశ్రమ, టిక్కెట్ ధరల గురించి మాట్లాడుతున్నాము. మేము అత్యధిక పన్ను చెల్లించే పరిశ్రమ” అని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ రాజ్యసభలో మాట్లాడారు.
ఎంపీ జయా బచ్చన్ ప్రశ్నలకు స్పందిస్తూ.. ఎంటర్ టైన్మెంట్ ట్యాక్స్, టిక్కెట్ ధరలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి రావని ఆర్థికమంత్రి అన్నారు. టికెట్ ధరలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల సినీ పరిశ్రమ నష్టపోతోందని ఎంపీ అంటున్నారని, కానీ టికెటింగ్ రాష్ట్ర అంశమన్నారు. తనను అడగడంలో అర్థం లేదని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 2026 కేంద్ర బడ్జెట్ ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీకి ఏదైనా సహకారం అందిస్తుందా? అనే ప్రశ్నకు నిర్మలా సీతారామన్ స్పందిస్తుండగా జయా బచ్చన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎంపీ జయా బచ్చన్ వాదనను తోసిపుచ్చుతూ.. బడ్జెట్ సినీ పరిశ్రమకు ప్రాముఖ్యత ఇచ్చిందని, కంటెంట్ జనరేటర్స్, యానిమేటర్లు, విజువల్ ఎఫెక్ట్స్ నైపుణ్యాన్ని నిర్ధారించడానికి చర్యలు తీసుకున్నామని ఆర్థిక మంత్రి తేల్చి చెప్పారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ దేశవ్యాప్తంగా 1500 పాఠశాలల్లో నైపుణ్యం, కంటెంట్-సృష్టికర్త ప్రయోగశాలలను స్థాపించడంలో సహాయపడుతుందన్నారు. 2030 నాటికి రెండు మిలియన్ల మంది నిపుణులు సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.
Also Read: అసెంబ్లీ ముందుకు బడ్జెట్.. ఆర్థిక మంత్రి ప్రసంగం.. రంగాల వారీగా కేటాయింపులు
కంటెంట్ సృష్టి అనేది అత్యంత నైపుణ్యం కలిగిన రంగమని నిర్మలా సీతారామన్ అన్నారు. నైపుణ్యాల కొరత, డిజైన్ ఉత్పత్తి, దుస్తులు, సెట్లు, విజువల్ ఎఫెక్ట్స్ కోసం కొత్తగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ శాఖలను ఏర్పాటు చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. అలాగే వేవ్స్ 2025 నిర్వహించామమని, ఇది ప్రపంచ ఎంటర్ టైన్మెంట్ కు వేదికగా నిలిచిందన్నారు. తొంభైకి పైగా దేశాలు ఇందులో పాల్గొన్నాయన్నారు. 10,000 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారని గుర్తుచేశారు. వేలాది మంది కంటెంట్ జనరేటర్లు, 300 కి పైగా కంపెనీలు వేవ్స్ లో పాల్గొన్నాయని గుర్తుచేశారు. ఇవి వినోద పరిశ్రమ వైపు ప్రయత్నాలు కాదా?” అని ఆమె అన్నారు.