విదేశాల్లో ఉద్యోగాల కోసమని ఆశపడే నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ దోపిడీకి పాల్పడుతున్న ముఠాను జూబ్లీహిల్స్ పోలీసులు ఎట్టకేలకు బట్టబయలు చేశారు. ‘ట్రివియల్ చాప్టర్’ (Trivial Chapter) అనే సంస్థ పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్న ఈ ముఠా గ్రీస్, రొమేనియా వంటి యూరప్ దేశాల్లో ఆకర్షణీయమైన ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేసింది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి ఈ ముఠాలోని ఇద్దరు కీలక నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఈ సంస్థ సౌత్ జోన్ వైస్ ప్రెసిడెంట్ లంక నిరుపమ (A7) తో పాటు తెలంగాణ రీజినల్ మేనేజర్ మామిడి అరుణ్ రాజ్ (A8) ఉన్నారు.
ఈ కేటుగాళ్ల మోసపూరిత విధానం అత్యంత పక్కాగా సాగింది. మొదటగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఓవర్సీస్ ఉద్యోగాలంటూ భారీగా ప్రకటనలు ఇచ్చేవారు. విదేశాల్లో స్థిరపడాలని తపించే యువత ఈ ప్రకటనలు చూసి వారిని సంప్రదించగానే మాయమాటలతో బుట్టలో వేసుకునేవారు. నిబంధనల ప్రకారం విదేశీ రిక్రూట్మెంట్ కోసం ఉండాల్సిన ఆర్ఏ (RA) లైసెన్స్ లేకపోయినప్పటికీ పెద్ద కన్సల్టెన్సీగా వీరు ప్రచారం చేసుకున్నారు. ఒక్కో నిరుద్యోగి నుంచి వారి అర్హతలను బట్టి రూ.50,000 నుండి రూ.4,00,000 వరకు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
డబ్బులు చెల్లించిన వారికి నమ్మకం కలిగించేందుకు నిందితులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించేవారు. నకిలీ ‘వర్క్ ఆథరైజేషన్’ లేఖలను సృష్టించి బాధితులకు అందజేసేవారు. ఆ లేఖలు చూసి నిజమని నమ్మిన అభ్యర్థులు మిగిలిన మొత్తాన్ని కూడా చెల్లించేవారు. ఒకసారి భారీ మొత్తంలో డబ్బు చేతికందగానే నిందితులు తమ అసలు స్వరూపాన్ని బయటపెట్టేవారు. బాధితులతో సంప్రదింపులు పూర్తిగా నిలిపివేయడంతో పాటు ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యేవారు. నకిలీ ఆఫర్ లెటర్లు పట్టుకుని గాలిలో దీపంలా మిగిలిపోయిన బాధితులు తాము మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు.
ఈ కేసులో మరికొంత మంది నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం సంస్థ ఫౌండర్, సీఈవో సహా మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నారు. వీరంతా పక్కా ప్రణాళికతో ముఠాగా ఏర్పడి నిరుద్యోగుల బలహీనతలతో ఆడుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సంస్థపై గతంలో కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా కేసులు నమోదైనట్లు విచారణలో తేలింది. పాత కేసుల నేపథ్యం ఉన్నప్పటికీ పేరు మార్చి లేదా మరో చోట కార్యాలయాలు తెరిచి వీరు యథేచ్ఛగా మోసాలకు పాల్పడుతున్నారు. నిరుద్యోగులు ఇటువంటి ప్రకటనలు చూసి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ALSO READ: Heatwave Alert: ఎండలో బయటకు రావొద్దు.. నెత్తిన తలపాగ పెట్టుకోండి.. మంత్రి సీతక్క విజ్ఞప్తి