Heatwave Alert: తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. ప్రజా భవన్ లో సీతక్క మాట్లాడుతూ నానాటికి పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజలు బయటికి రావొద్దని మంత్రి సూచించారు. అత్యవసర పనులు ఉంటే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్యలో పూర్తి చేసుకోవాలని హితవు పలికారు.
ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి రావాల్సి వస్తే తలకు టోపీ, తలపాగా పెట్టుకోవాలని మంత్రి సీతక్క సూచించారు. శరీరాన్ని ఎండ నుంచి రక్షించుకోవాలన్నారు. ఈ జాగ్రత్తలు పాటించకపోతే వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పంచాయత్ రాజ్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ చలివేంద్రాలు తక్షణమే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి సూచించారు.
ఇక ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కార్మికులకు మంత్రి సీతక్క ప్రత్యేకంగా సూచనలు చేశారు. వేసవికాలంలోనే ఎక్కువగా పనులు జరుగుతున్న నేపథ్యంలో కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎండలో పని చేయాల్సి వస్తే తలకు తలపాగా ధరించడం, శరీరాన్ని కాపాడుకోవడం, సమీపంలో తాగునీరు ఉంచుకోవడం తప్పనిసరి అని చెప్పారు. పనిస్థలాల్లో మంచినీటి సదుపాయం కల్పించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు.
Also Read: Airtel బెస్ట్ 30 డేస్ ప్లాన్స్.. 60GB డేటా, అపరిమిత కాల్స్.. ఉచిత సబ్స్క్రిప్షన్స్!
ఉపాధి హామీ పనుల్లో హాజరు నమోదు కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫేషియల్ రికగ్నిషన్ విధానం వల్ల కార్మికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ సందర్భంగా సీతక్క అన్నారు. అయినప్పటికీ ఆ నిబంధనలను అమలు చేయాల్సిన పరిస్థితి ఉందని, ఉపాధీ కూలీలు దీన్ని గమనించాలని కోరారు. కార్మికుల ఆరోగ్యం.. ప్రభుత్వానికి కూడా ముఖ్యమేనని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో పనులు చేయకుండా అవసరమైతే తగిన జాగ్రత్తలతో మాత్రమే పని చేయాలని మంత్రి సూచించారు.
Also Read: TCS Nashik Case: మహిళా ఉద్యోగులపై వేధింపులు.. మత మార్పిడికై ఒత్తిడి.. వెలుగులోకి నమ్మలేని నిజాలు!