KBR Traffic: హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే కేబీఆర్ (KBR) పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా పార్క్ చుట్టూ ప్రతిష్టాత్మకమైన ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ పనుల నేపథ్యంలో వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ పోలీసులు భారీ మార్పులు చేపట్టారు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డెవిస్ ఆధ్వర్యంలో ట్రయల్ రన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం జరుగుతున్నది కేవలం ప్రయోగాత్మక పరీక్ష మాత్రమేనని, వారం రోజుల పాటు క్షేత్రస్థాయిలో వాహనాల రాకపోకలను నిశితంగా పరిశీలిస్తామని తెలిపారు. ఈ మార్పుల వల్ల వాహనదారులకు ఎదురయ్యే ఇబ్బందులను అధ్యయనం చేసి, వారం తర్వాత పూర్తిస్థాయి డైవర్షన్లపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా కేబీఆర్ పార్క్ సిగ్నల్, బసవతారకం, అగ్రసేన్ జంక్షన్, సీవీఆర్ జంక్షన్ , జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వంటి ప్రధాన కూడళ్ల వద్ద ఎక్కడా ట్రాఫిక్ నిలవకుండా ‘ఫ్రీ లెఫ్ట్’ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్నారు.
న్యూ సిటీ , ఓల్డ్ సిటీలను కలిపే ఈ మార్గం నగరానికి ఒక లైఫ్ లైన్ వంటిదని, అభివృద్ధి పనుల దృష్ట్యా ప్రజలు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలిగించే అడ్డంకులను గుర్తించి వెంటనే తొలగిస్తామని, వాహనదారులకు నిరంతరం అవగాహన కల్పిస్తామని హామీ ఇచ్చారు. నగర భవిష్యత్తు అవసరాల కోసం చేపడుతున్న ఈ నిర్మాణ పనులకు ప్రజలు, వాహనదారులు పోలీసుల సూచనలు పాటిస్తూ అండగా నిలవాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Also Read: మందుబాబుల వీరంగం.. మాదాపూర్లో ఆర్టీసీ బస్సు డ్రైవర్పై దాడి, అద్దాలు ధ్వంసం!