Hyderabad Metro: హైదరాబాద్ నగరవాసులకు మెట్రో సేవలు మరింత చేరువ చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి నెలాఖరుకు మెట్రోల డీపీఆర్లు పూర్తి చేయాలని, సాధ్యమైనంత త్వరగా మెట్రో రెండవ దశకు సంబంధించిన పనులను పూర్తి చేసి, నగరవాసులకు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణ, రేడియల్ రోడ్ల నిర్మాణాలు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాలపై తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఈ సంధర్భంగా సంబంధిత అధికారులతో సీఎం మెట్రో విస్తరణ పనుల ప్రారంభంపై సుధీర్ఘంగా చర్చించారు.
ఫ్యూచర్ సిటీ, శామీర్పేట్, మేడ్చల్ మెట్రో మార్గాలకు సంబంధించిన సమగ్ర వివరణాత్మక ప్రణాళికలు మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సీఎం, అధికారులను ఆదేశించారు. 3 మెట్రోల డీపీఆర్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొంది ఏప్రిల్ నెలాఖరుకు టెండర్లు పిలవాలని సీఎం సూచించారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం – ఫ్యూచర్ సిటీ మెట్రో 40 కి.మీ, జేబీఎస్ – శామీర్పేట మెట్రో 22 కి.మీ, ప్యారడైజ్ – మేడ్చల్ మెట్రో 23 కి.మీ మార్గాలకు సంబంధించి భూ సేకరణను వెంటనే పూర్తి చేయాలని సీఎం సూచించారు.
ఎలివేటెడ్ కారిడార్ల విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఎలైన్మెంట్ రూపొందించేటప్పుడే క్షేత్ర స్థాయిలో సమగ్ర పరిశీలన చేయాలని, మేడ్చల్ మార్గంలో ఎన్హెచ్ మార్గంలో ఇప్పటికే ఉన్న మూడు ఫ్లైఓవర్లను దృష్టిలో ఉంచుకొని మెట్రో లైన్ తీసుకెళ్లాలన్నారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
శామీర్పేట్, మేడ్చల్ మెట్రోలు ఒకే చోట ప్రారంభమయ్యేలా చూసుకోవాలని… అక్కడ అధునాతన వసతులు, భవిష్యత్ అవసరాలకు తగినట్లు భారీ జంక్షన్ ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి, అధికారులకు సూచించారు. ఆయా ప్రాంతాల వారు ప్రతి పనికి నగరంలోకి రానవసరం లేకుండా, అక్కడే అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఆ జంక్షన్ను అభివృద్ధి చేయాలన్నారు. జంక్షన్కు సంబంధించిన పూర్తి ప్రణాళికను తయారు చేయాలని సీఎం ఆదేశించారు.
Also Read: Rythu Bharosa Scheme Update: రైతుభరోసా స్కీమ్.. కీలక అప్ డేట్ ఇదే
హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ హెచ్జీసీఎల్ కింద రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. సమీక్షలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస రాజు, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి దానకిశోర్, హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్.వి.ఎస్.రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఫ్లాగ్షిప్ కార్యక్రమాల కమిషనర్ శశాంక తదితరులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ నివాసంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్లు, మెట్రో విస్తరణపై చర్చ pic.twitter.com/HStxb1UlQi
— BIG TV Breaking News (@bigtvtelugu) January 7, 2025