హైదరాబాద్ నగరవాసుల జీవనాడి మెట్రో రైలుపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (PPP) పద్ధతిలో కొనసాగుతున్న ఈ ప్రాజెక్టును ఇకపై పూర్తిస్థాయి ప్రభుత్వ రంగ సంస్థగా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ మెగా ప్రాజెక్టులో ఎల్అండ్టీ (L&T) సంస్థకు ఉన్న 100 శాతం ఈక్విటీని ప్రభుత్వం తన స్వాధీనం చేసుకుంది. సుమారు 15 వేల కోట్ల రూపాయల భారీ డీల్ ద్వారా ఈ యాజమాన్య బదిలీ ప్రక్రియను ఏప్రిల్ 30వ తేదీ లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయంతో మెట్రో నిర్వహణ పగ్గాలు పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లోకి వచ్చాయి.
మెట్రో యాజమాన్య బదిలీ నేపథ్యంలో ప్రభుత్వం నూతన బోర్డు ఆఫ్ డైరెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావును మెట్రో చైర్మన్గా నియమించింది. మెట్రో ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ తన విధుల్లో కొనసాగుతారు. బోర్డు డైరెక్టర్లుగా జయేశ్ రంజన్, వికాస్ రాజ్, ఫైనాన్స్ సెక్రటరీ సుల్తానియా, డీజీపీ శివధర్ రెడ్డి వంటి కీలక అధికారులను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ ఉన్నతాధికారుల బృందం మెట్రో భవిష్యత్తు ప్రణాళికలు.. రెండో దశ విస్తరణ పనులు.. రోజువారీ నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించనుంది.
గత కొంతకాలంగా ఎల్అండ్టీ సంస్థ మెట్రో నిర్వహణలో తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. రాయితీలు.. నష్టాల భర్తీ విషయంలో ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం అందక ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని ఆ సంస్థ భావించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం రంగంలోకి దిగి ఈక్విటీ కొనుగోలుకు నిర్ణయం తీసుకుంది. మెట్రోపై పూర్తి నియంత్రణ సాధించడం ద్వారా ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థిక వివాదాలకు స్వస్తి పలికి ప్రాజెక్టును లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా కొత్త బోర్డు పనిచేయనుంది.
హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ పనులు ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మెట్రోను ఎయిర్పోర్టు మార్గానికి అనుసంధానించడం.. పాతబస్తీ మెట్రో పనులను వేగవంతం చేయడం వంటి సవాళ్లు కొత్త యాజమాన్యం ముందున్నాయి. ప్రభుత్వ నియంత్రణలోకి రావడంతో నిధుల సమీకరణ.. భూసేకరణ వంటి అంశాల్లో నిర్ణయాలు త్వరగా తీసుకునే వీలుంటుంది. నగర రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు ఈ చారిత్రాత్మక నిర్ణయం దోహదపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో మెట్రో ఉద్యోగుల్లోనూ కొత్త ఉత్సాహం నెలకొంది.
ALSO READ: అధికారం పోయాకే గుంటనక్కలు గుర్తుకొచ్చాయా? కవితను ప్రశ్నించిన మహేష్ కుమార్ గౌడ్