హైదరాబాద్లోని మియాపూర్ ప్రాంతంలో ఉన్న కిన్నెర గ్రాండ్ హోటల్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. బిర్యానీకి పెట్టింది పేరుగా భావించే నగరంలో ఇలాంటి అమానవీయ ఘటనలు వెలుగులోకి రావడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యం పరాకాష్టకు చేరిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హైదరాబాద్ నగరవాసులకు బిర్యానీ అంటే ప్రాణం. కానీ ఆ ప్రాణమే ఇప్పుడు ప్రమాదంలో పడేలా కనిపిస్తోంది. మియాపూర్ ప్రధాన రహదారిపై ఉన్న కిన్నెర గ్రాండ్ హోటల్లో చోటుచేసుకున్న ఉదంతం విస్తుపోయేలా చేస్తోంది. ఒక కస్టమర్ ఎంతో ఇష్టంగా ఆర్డర్ చేసిన బిర్యానీలో ఏకంగా గుట్కా ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. ఆహార భద్రత ప్రమాణాలను హోటల్ యాజమాన్యం గాలికి వదిలేసిందని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.
వివరాల ప్రకారం.. ఒక వ్యక్తి మియాపూర్ కిన్నెర గ్రాండ్ హోటల్కు వెళ్లి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. వేడివేడిగా వచ్చిన బిర్యానీని ఆస్వాదిస్తూ తింటున్న క్రమంలో అతడికి నోటిలో ఏదో వింత పదార్థం తగిలింది. దానిని బయటకు తీసి చూడగా అది సగం చిరిగిన గుట్కా ప్యాకెట్ అని తెలిసి నివ్వెరపోయాడు. అప్పటికే ఆ ప్యాకెట్ లోని కొంత భాగం ఆహారంతో కలిసి కడుపులోకి వెళ్లినట్లు గుర్తించిన బాధితుడు తీవ్ర ఆందోళనకు లోనయ్యాడు.
అంతటితో ఆగకుండా ప్లేట్ను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించగా లోపల మరో గుట్కా ప్యాకెట్ కూడా కనిపించింది. ఒకే బిర్యానీ ప్లేట్లో రెండు గుట్కా ప్యాకెట్లు ఉండటం చూసి అక్కడ భోజనం చేస్తున్న ఇతర వినియోగదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వంట గదిలో సిబ్బంది ఎంత అపరిశుభ్రంగా పని చేస్తున్నారో ఈ ఉదంతం అద్దం పడుతోంది. బిర్యానీ వండుతున్న సమయంలోనే సిబ్బంది గుట్కా నములుతూ వాటిని అనుకోకుండా అందులో పడేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఘటనపై బాధితుడు వెంటనే హోటల్ యాజమాన్యాన్ని నిలదీశాడు. తన ఆరోగ్యం పాడైతే బాధ్యత ఎవరని ప్రశ్నించాడు. అయితే యాజమాన్యం మాత్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది. తప్పు ఒప్పుకుని క్షమాపణలు చెప్పాల్సింది పోయి పొంతన లేని సమాధానాలతో కాలయాపన చేశారు. అది ఎలా వచ్చిందో తమకు తెలియదని.. పొరపాటు జరిగి ఉండవచ్చని నిర్లక్ష్యంగా బదులిచ్చారు. బాధితుడు హోటల్ సిబ్బంది తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆహార తనిఖీ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యాడు.
నగరంలో ఇలాంటి హోటళ్లపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లాభాల కోసమే తప్ప వినియోగదారుల ప్రాణాల గురించి పట్టించుకోని యాజమాన్యాల వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలోనూ పలు హోటళ్లలో పురుగులు రావడం.. కుళ్లిన మాంసం దొరకడం వంటివి చూశాం. ఇప్పుడు ఏకంగా గుట్కా ప్యాకెట్లు రావడం ఆహార భద్రతపై గల నమ్మకాన్ని సడలిస్తోంది. కిన్నెర గ్రాండ్ హోటల్ లైసెన్స్ను రద్దు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ALSO READ: ఒత్తిడితో సతమతమవుతున్నారా? స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఈ ‘సింపుల్’ చిట్కాలు పాటించండి!