భాగ్యనగరంలో అత్యంత ప్రజాదరణ పొందిన నుమాయిష్ (పారిశ్రామిక ప్రదర్శన)కు వెళ్లాలనుకునే సందర్శకులకు హైదరాబాద్ పోలీసులు కీలక సూచన చేశారు. నాంపల్లి పరిసర ప్రాంతాల్లో సంభవించిన భారీ అగ్నిప్రమాదం కారణంగా ఆ ప్రాంతమంతా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా ఉండాలనే ఉద్దేశంతో, ఈరోజు తమ ఎగ్జిబిషన్ పర్యటనను వాయిదా వేసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్వయంగా విజ్ఞప్తి చేశారు.
అసలేం జరిగిందంటే..
నాంపల్లిలోని ఒక ఫర్నిచర్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దుకాణంలో ప్లాస్టిక్, చెక్క సామాగ్రి వంటి సులభంగా మంటలు అంటుకునే వస్తువులు ఉండటంతో నిమిషాల వ్యవధిలోనే మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేయడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి.
ట్రాఫిక్ ఆంక్షలు – పోలీసుల విజ్ఞప్తి..
అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతం నుమాయిష్కు అతి సమీపంలో ఉండటంతో పాటు, ప్రధాన రహదారి కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఫైర్ ఇంజన్లు, సహాయక చర్యలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు పోలీసులు ఆ మార్గంలో ట్రాఫిక్ను మళ్లించారు. సాధారణంగా సాయంత్రం వేళల్లో నుమాయిష్కు వచ్చే జనం రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అగ్నిప్రమాదం వల్ల ఏర్పడిన గందరగోళానికి తోడు, సందర్శకుల రద్దీ పెరిగితే సహాయక చర్యలకు ఆటంకం కలగడమే కాకుండా, ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
పర్యటన వాయిదా వేసుకోండి..
ఈ పరిస్థితిని సమీక్షించిన పోలీస్ కమిషనర్, ప్రజల క్షేమం దృష్ట్యా ఈ రోజుకు ఎగ్జిబిషన్ పర్యటనను విరమించుకోవాలని కోరారు. ‘నాంపల్లిలో జరిగిన అగ్నిప్రమాదం వల్ల ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగింది. సందర్శకులు ఇబ్బందులు పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రజలు పోలీసులకు సహకరించాలి’ అని ఆయన పేర్కొన్నారు. కేవలం అత్యవసర పనుల మీద వెళ్లే వారు తప్ప మిగిలిన వారు ఆ రూట్లోకి రావొద్దని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.