Hyderabad City: జమ్మూకాశ్మీర్లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో నివసిస్తున్న పాకిస్థానీయుుల వీసాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. నిర్దేశిత గడువులోగా పాకిస్థాన్ పౌరులు దేశం విడిచి వెళ్లాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న పాక్ పౌరులకు కొత్త టెన్షన్ మొదలైంది.
ఇంతకీ తెలంగాణలో ఎంతమంది పాక్ పౌరులు ఉన్నారు? ఇదే ప్రశ్న చాలామందిని వెంటాడుతోంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు వేర్వేరు వీసాలతో హైదరాబాద్ సిటీలో పాకిస్థాన్ పౌరులు దాదాపు 208 ఉన్నట్లు సమాచారం. ఇంకా చాలా ప్రాంతాల్లో పోలీసులు వెరిఫికేషన్ మొదలుపెట్టారు.
హైదరాబాద్ లో ఎంతమంది ఉన్నారు?
కేంద్రం ఆదేశాలతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని స్పెషల్ బ్రాంచ్లో నమోదైన పాకిస్థాన్ పౌరుల వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. విదేశీయులు శంషాబాద్లోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో నమోదు చేసుకోవాలి.
పాకిస్థాన్, బంగ్లాదేశ్ పౌరులు నగర కమిషనరేట్ పరిధిలోని పాతబస్తీ పురానీ హవేలీలోవున్న ప్రత్యేక విభాగంలో రిజిస్టర్ చేసుకోవాలి. అక్కడ లభించిన సమాచారం ప్రకారం హైదరాబాద్ సిటీలో 208 మంది పాకిస్థానీయులు ఉన్నట్లు అధికారిక లెక్క.వారిలో 156 మంది లాంగ్ టర్మ్ వీసా కలిగినవారు ఉన్నారు.
ALSO READ: ఎంత తాగినా కిక్ ఎక్కట్లేదా? ఇలా చేస్తే ఇంకేం ఎక్కుద్ది?
ఇక్కడి వారిని పెళ్లి చేసుకున్నవారికి, వారి బంధువులకు ఈ తరహా వీసాలను జారీ చేస్తారు. మరో 13 మంది షార్ట్ టర్మ్ వీసాలు కలిగివున్నారు. మిగిలినవారు ట్రీట్మెంట్ నిమిత్తం మెడికల్ వీసాలపై నగరంలో ఉంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 27 వరకు ప్రభుత్వం సమయం ఇవ్వడంతో పత్రాలను తనిఖీలు తయారు చేయడం ప్రారంభించామని ప్రత్యేక అధికారి తెలిపారు.
మెడికల్ వీసాపై ఉన్నవారికి ఏప్రిల్ 29 వరకు సమయం ఉందన్నారు. గురువారం సాయంత్రం వరకు సార్క్ వీసాపై వచ్చిన పాకిస్తానీయులను గుర్తించడానికి రికార్డులను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఆ వీసాపై హైదరాబాద్లో ఇప్పటివరకు ఎవరూ కనిపించలేదన్నారు.
ఏప్రిల్ 27న ఇమ్మిగ్రేషన్ అధికారులతో సమన్వయం చేసుకుంటామని, పాకిస్తానీయులు సిటీ విడిచి వెళ్లారా? లేదా అనేది అప్పుడు నిర్ధారించుకుంటామని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఎవరైనా ఉన్నారా అనేదానిపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు.
SAARC వీసా 24 విభాగాలు
SAARC వీసా మినహాయింపు కింద కొన్నివర్గాల ప్రముఖులకు స్పెషల్ ట్రావెల్ డాక్యుమెంట్ జారీ చేస్తారు. ఈ జాబితాలో 24 వర్గాల వ్యక్తులుంటారు. వారిలో ప్రముఖులు, హైకోర్టు న్యాయమూర్తులు, పార్లమెంటేరియన్లు, సీనియర్ అధికారులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, క్రీడాకారులు ఉంటారు.
పాక్ పౌరుల వీసాల రద్దు నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది కేంద్రం. రాష్ట్రాల సీఎంలతో హోంమంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. పాకిస్తానీయులను వెనక్కి పంపాలని ఆదేశించారు. ఉగ్రదాడి నేపథ్యంలో పారా మిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేశారు ఉన్నతాధికారులు.
సెలవులపై వెళ్లిన జవాన్లు వెంటనే రిపోర్ట్ చేయాలని ఆదేశాలు అయ్యాయి. దేశంలో ఉన్న పాకిస్థాన్ పౌరులు పంజాబ్లోని అటారీ, వాఘా సరిహద్దుల ద్వారా స్వదేశానికి వెళ్తున్నారు. పాక్ పౌరులు వెనక్కి వెళ్లడంతో సరిహద్దు ప్రాంతాల్లో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది.