కాదేదీ కల్తీకనర్హం. నాణ్యమైన వస్తువు పేరు చెప్పి, అందులో నాసిరకం కలిపి ఇవ్వడమే కల్తీ. నిత్యావసరాలతో మొదలు పెడితే.. అన్నిట్లోనూ కల్తీ సహజంగా మారింది. అంటే కాస్త రేటెక్కువ పెట్టి నాణ్యమైన వస్తువులు కొనుక్కుంటున్నామనే తృప్తి మనకు ఉంటుంది కానీ, అందులో కూడా నాసిరకం కలసి ఉంటుందనే విషయం మనం గుర్తించలేకపోతున్నాం. అదే కేటుగాళ్లకు అవకాశంగా మారింది. కల్తీ మద్యం గురించి చాన్నాళ్లుగా వార్తలొస్తున్నా.. ఇప్పుడు జరిగిన కల్తీ మాత్రం పూర్తిగా కొత్త ఉదాహరణే. హైదరాబాద్ లోని లింగంపల్లి పరిధిలో ఓ బార్ లో మద్యాన్ని కల్తీ చేస్తున్నారు. బ్రాండెడ్ మద్యం అమ్ముతున్నట్టుగా కలరింగ్ ఇస్తూ.. వాటికి సీల్ తీసేసి లోకల్ బ్రాండ్లు వాటిలో కలుపుతున్నారు. దీనివల్ల ఎవరికీ ప్రాణాపాయం లేదు కానీ, ఫారిన్ సరుకు అని ఊహించుకుంటూ మందుబాబులు నాసిరకం మద్యం తాగేస్తూ మోసపోతున్నారు. ఈ కల్తీ బ్యాచ్ ని తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కల్తీ ఎలా చేస్తారు..?
లింగంపల్లిలోని ట్రూప్స్ బార్ లో మద్యం కల్తీ జరుగుతోంది. ఉదాహణరకు జేమ్సన్ లిక్కర్ ఫుల్ బాటిల్ ధర రూ.2690 గా ఉంది. అయితే ఇందులో వెయ్యి రూపాయలకు లభించే ఓక్స్మిత్ బ్రాండ్ ని మిక్స్ చేస్తున్నారు. ఈ మిక్సింగ్ వ్యవహారం మందుబాబులకు తెలియకుండా జాగ్రత్తపడుతున్నారు. ఒకరకంగా ఈ ప్రపంచంలో మందుబాబుల్ని చాలా ఈజీగా మోసం చేయొద్దు. నాలుగైదు పెగ్గులు పడితే చాలామందికి తాము ఏం తాగుతున్నామో, ఎంత తాగుతున్నామో కూడా తెలియదు. ఈ లాజిక్ తోనే వారికి నాసిరకం సరకు అండగడుతున్నారు ట్రూప్స్ బార్ యజమానులు.
ఎలా బయటపడింది..?
ఈ కల్తీ వ్యవహారం చాలా గమ్మత్తుగా బయటపడింది. ట్రూప్స్ బార్ చాన్నాళ్లుగా రెన్యువల్ కి దరఖాస్తు పెట్టుకోలేదు. అదే సమయంలో ఆ బార్ కి సంబంధించి మద్యం డిపోలకు పెద్దగా ఆర్డర్లు వెళ్లడం లేదు. మద్యం డిపోల దగ్గర వారు కొనుగోలు చేయట్లేదు, కానీ బార్ లో మద్యం అమ్మకాలు బాగున్నాయి. ఇక్కడేదో జరుగుతోందనే అనుమానం ఎక్సైజ్ పోలీసులకు వచ్చింది. వారు నిఘా పెట్టారు. ఒక్కసారిగా బార్ పై దాడి చేయడంతో అక్కడ జరుగుతున్న కల్తీ వ్యవహారం బయటపడింది. ఎక్సైజ్ సిబ్బంది దాడిలో.. మిక్సింగ్ చేసిన 75 మద్యం బాటిళ్లు, 55 ఖాళీ బాటిళ్లు దొరికాయి. మిగతా సరకు కోసం గాలిస్తున్నారు.
ఈ కల్తీ ఖరీదు ఎంతంటే..?
ఎక్సైజ్ పోలీసులు దాడుల్లో లక్షా 48వేల రూపాయల కల్తీ మద్యం పట్టుబడింది. చౌకబారు మద్యంతోపాటు, కొన్ని బాటిళ్లలో నీటిని కూడా కలుపుతూ మందుబాబుల్ని మోసం చేస్తున్నారు ట్రూప్స్ బార్ నిర్వాహకులు. దీంతో వారిపై పోలీసులు కేసులు పెట్టారు. బార్ లైసన్స్ ఓనర్ ఉదయ్ కుమార్ రెడ్డి, మేనేజర్ వి.సత్యనారాయణ రెడ్డి బార్ లో పని చేసే ఉద్యోగి పునీత్ పట్నాయక్లపై కేసు నమోదు చేశారు.
మిగతా బార్లపై నిఘా..
ప్రస్తుతం టూప్స్ బార్ లో గుట్టు రట్టయింది. మిగతా బార్లలో కూడా ఇలాంటి తతంగం జరుగుతుందేమోననే అనుమానం ఉంది. అందుకే ఆయా బార్లపై కూడా ఎక్సైజ్ సిబ్బంది నిఘా పెట్టారు. వైన్ షాపుల్లో, బార్లలో మద్యం కల్తీ జరిగిందనే అనుమానం ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని అంటున్నారు. కల్తీ మద్యం విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే కొన్నిసార్లు అది తీవ్ర అనారోగ్యానికి కారణం అవుతుందని హెచ్చరిస్తున్నారు.