Safe School Operation: స్వేచ్ఛ బ్యూరో: విద్యార్థుల బంగారు భవిష్యత్తును చిదిమేస్తున్న డ్రగ్స్ భూతాన్ని మట్టుబెట్టటమే లక్ష్యంగా హైదరాబాద్ పోలీసులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా శనివారం ఆపరేషన్ సేఫ్ స్కూల్ పేర కమిషనరేట్ వ్యాప్తంగా విద్యా సంస్థల వద్ద పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్న షాపులపై దాడులు చేశారు. దీంట్లో 5వేల మంది సిబ్బంది పాల్గొనగా కమిషనర్ వీ.సీ.సజ్జనార్ క్షేత్రస్థాయిలో తనిఖీలు జరిపారు. దీంట్లో పలువురు వ్యాపారులు విద్యార్థులకు పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్నట్టుగా నిర్ధారణ అయిన నేపథ్యంలో వారికి హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై పిల్లలకు పొగాకు ఉత్పత్తులు అమ్మితే ఖబడ్ధార్ అని హెచ్చరించారు.
శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం పొగాకులో ఉండే నికోటిన్ ను ఒక్కసారి రుచి చూస్తే కొన్ని రోజుల్లోనే దానికి బానిసగా మారటం ఖాయం. అది సిగరెట్ కావచ్చు…పాన్ మసాలాలో కలుపుకొని తినే జర్ధా కావచ్చు. అయితే, కొన్నాళ్ల తరువాత నికోటిన్ ఇచ్చే కిక్కు దానికి అలవాటు పడ్డవారికి సరిపోదు. ఈ క్రమంలో మద్యం…డ్రగ్స్ వైపు మళ్లుతున్నారు. చివరకు మద్యం, డ్రగ్స్ కు పూర్తిగా బానిసలుగా మారి మత్తులో నేరాలకు సైతం పాల్పడుతూ భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో ప్రాథమిక దశలోనే విద్యార్థులు మత్తుకు అలవాటు పడకుండా చూసేందుకు హైదరాబాద్ పోలీసులు చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే ఆపరేషన్ సేఫ్ స్కూల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిజానికి 2003 పొగాకు ఉత్పత్తుల చట్టం సెక్షన్ 6(బీ) ప్రకారం విద్యా సంస్థల వద్ద వంద గజాల దూరంలోపు ఎలాంటి పొగాకు ఉత్పత్తులను విక్రయించరాదు. దాంతోపాటు జువెనైల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 77 ప్రకారం పిల్లలకు పొగాకు ఉత్పత్తులు అమ్మటం నిషిద్ధం. వీటిని ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేస్తే జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే, విద్యా సంస్థల వద్ద కిరాణా షాపులు, చిన్న పిల్లల తినుబండారాల దుకాణాలు నడుపుతున్న వారిలో కొందరు డబ్బు సంపాదనే లక్ష్యంగా చిన్న పిల్లలకు సిగరెట్లు, పాన్ మసాలా తదితర వాటిని విక్రయిస్తున్నారు. కొందరు గంజాయి కలిపిన చాక్లెట్ల సైతం అమ్ముతూ పట్టుబడ్డ ఉదంతాలు ఎన్నో ఉన్నాయి.
Also Read: రంగారెడ్డి జిల్లాలో రగులుతున్న పదవుల వేట.. ఇక అందరి చూపు అటువైపే..?
ఈ నేపథ్యంలోనే పిల్లలకు పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్న వారి ఆట కట్టించేందుకు పోలీసులు నడుం బిగించారు. శనివారం 5వేల మంది సిబ్బంది వేర్వేరు బృందాలుగా విడిపోయి విద్యా సంస్థల వద్ద ఉనక్న 558 దుకాణాల్లో తనిఖీలు జరిపారు. కమిషనర్ సజ్జనార్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి చిరాగ్ అలీ లేన్, రెడ్ హిల్స్, మెహదీపట్నం, మల్లేపల్లి ప్రియా టాకీస్ జంక్షన్, గోషామహల్ తదితర ప్రాంతాల్లోని షాపులను తనిఖీ చేశారు. చట్టాలను ఉల్లంఘించి విద్యా సంస్థల వద్ద సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. గోషామహల్ ముస్లింజంగ్ బ్రిడ్జీ వద్ద మీడియాతో మాట్లాడుతూ మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మే వారిపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో జరిపిన ఈ ఆపరేషన్ లో పలువురు దుకాణందారులు చిన్నపిల్లలకు పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్నట్టుగా నిర్ధారణ అయ్యిందన్నారు.
ఇలా జరగకుండా చూడటానికి హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ లో ఓ ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్టు తెలిపారు. విద్యాసంస్థల యాజమాన్యాలు, తల్లిదండ్రులు సామాజిక బాధ్యతగా తీసుకుని విద్యా సంస్థల వద్ద పొగాకు ఉత్పత్తుల విక్రయాలను అడ్డుకునేందుకు సహకరించాలన్నారు. ఇక, ఆయా విద్యా సంస్థల పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు. విద్యా సంస్థల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు జరుగుతున్నట్టు తెలిస్తే వెంటనే 100 నెంబర్ కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. దాంతోపాటు 8712661601 నెంబర్ కు కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఆపరేషన్ లో అదనపు సీపీలు శ్రీనివాసులు, తఫ్సీర్ ఇక్భాల్, జాయింట్ సీపీలు జోయల్ డేవిస్, శ్వేత, టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, చార్మినార్ జోన్ డీసీపీ ఖారె కిరణ్ ప్రభాకర్, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి తదితరులు పాల్గొన్నారు.
Also Read: హర్మూజ్ జలసంధిలో ఉద్రికత్త.. భారత నౌకలపై ఇరాన్ దాడి