Garlic Paste: పక్కాగా సేకరించిన సమాచారం మేరకు రాజేంద్రనగర్ జోన్ పోలీసులు శుక్రవారం కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న రెండు కేంద్రాలపై దాడులు చేశారు. ఈ క్రమంలో 18వందల కిలోలకు పైగా పేస్ట్ తోపాటు రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. శాస్త్రిపురం, ఉడంగడ్డ రైల్వే ట్రాక్ సమీపంలోని మరో చోట కొంతమంది కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తూ మార్కెట్లోకి చలామణి తెస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది.
Also Read: RITES Limited: రూ.2 లక్షల జీతం ఉద్యోగాలు.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు
ఈ క్రమంలో రెండు బృందాలుగా విడిపోయిన పోలీసులు రెండు చోట్లా దాడులు జరిపారు. ఈ కేంద్రాలను నడుపుతున్న స్టాండర్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ యజమాని అబ్దుల్ అలీం (25), జసాని దిల్ దార్ అలీ (46)లను అరెస్ట్ చేశారు. వారి నుంచి 18వందల కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2కిలోల గమ్ పౌడర్, 2కిలోల టైటానియం ఆక్సయిడ్, లెమన్ ఎల్లో కలర్ సింథటిక్ ఫుడ్ కలర్, 7ప్యాకింగ్ మిషన్లు, 2 గ్రైండింగ్ మిషన్లు, 2వేయింగ్ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై బీఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 318(4), 274 ప్రకారం కేసులు నమోదు చేసి రిమాండ్ చేశారు.