Mule Accounts: స్వేచ్ఛ బ్యూరో: బ్యాంకుల్లో మ్యూల్ ఖాతాలు ఉంటే చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్ స్పష్టం చేశారు. టార్గెట్లు కాదు…కస్టమర్ల భద్రతకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. సేఫ్ కస్టమర్ ఛాలెంజ్ దిశగా బ్యాంకర్లు అడుగులు వేయాలని చెప్పారు. ఒక్క అకౌంట్ హోల్డర్ కూడా సైబర్ నేరాల బారిన పడకుండా చూడటమే లక్ష్యంగా పని చేయాలన్నారు. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో గురువారం వేర్వేరు బ్యాంకుల ప్రతినిధులతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతీ బ్యాంక్ జీరో మ్యూల్ అకౌంట్స్ లక్ష్యంగా పని చేయాలని చెప్పారు. రకరకాలుగా జనానికి టోకరా వేస్తూ లక్షలు..కోట్లు కొల్లగొడుతున్న సైబర్ క్రిమినల్స్ మ్యూల్ అకౌంట్ల ద్వారా ఆ డబ్బును ఎగరేసుకు పోతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఖాతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లో నమోదయ్యే ఫిర్యాదుల ఆధారంగా ఆయా బ్రాంచీలు ఎప్పటికప్పుడు పనితీరును సమీక్షించుకోవాలన్నారు. ఖాతాల సంఖ్య కాకుండా అకౌంట్ హోల్డర్ల భద్రతనే ఉద్యోగులు కీలక పనితీరు సూచికగా పరిగణించాలని చెప్పారు. ఆపరేషన్ ఆక్టోపస్ 2.0లో భాగంగా జరిపిన దాడుల్లో 850 కేసుల్లో 150 కోట్ల రూపాయల మోసాన్ని గుర్తించినట్టు చెప్పారు. ఆపరేషన్ లో భాగంగా మ్యూల్ అకౌంట్లను తెరవటంలో సహకరించిన 32మంది బ్యాంకు అధికారులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. కంబోడియా, వియత్నాం, దుబాయ్ వంటి దేశాల నుంచి సైబర్ నేరాలు చేస్తున్న అంతర్జాతీయ ముఠాలు స్థానిక బ్యాంక్ అధికారులతో కుమ్మక్కై మ్యూల్ అకౌంట్ల ద్వారా డబ్బును తరలించుకు పోతున్నారని తెలిపారు. కేవైసీ నిబంధనలను ఉల్లంఘించే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవటంతోపాటు వారిని బ్యాంకింగ్ రంగం నుంచి బ్లాక్ లిస్ట్ చేయాలని సూచించారు.
Also Read: ఆర్టీసీ సమ్మె సస్పెన్స్.. 29 డిమాండ్లకు సర్కార్ ఓకే.. ఆ మూడింటిపైనే పీటముడి!
ఇక, ఫిక్స్ డ్ డిపాజిట్లను ముందస్తుగా క్లోజ్ చేసేందుకు వచ్చే కస్టమర్ల విషయంలో బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సైబర్ క్రిమినల్స్ ఒత్తిడి.. బెదిరింపుల వల్లనే వాళ్లు డబ్బు విత్ డ్రా చేస్తున్నారా? అన్నది పరిశీలించాలని చెప్పారు. అదే నిజమైతే వారికి అవగాహన కల్పించి సైబర్ క్రిమినల్స్ చేతుల్లో డబ్బు పోగొట్టుకోకుండా చూడాలని తెలిపారు. మ్యూల్ అకౌంట్లను గుర్తించే మ్యూల్ హంటర్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. 1930 నెంబర్ పై అకౌంట్ హోల్డర్లకు విస్తృత అవగాహన కల్పించాలని చెప్పారు. సైబర్ నేరగాళ్ల నెట్ వర్క్ ను పూర్తిగా తుడిచి పెట్టేవరకు ఆపరేషన్ ఆక్టోపస్ కొనసాగుతుందని చెబుతూ దీంట్లో బ్యాంకులు పోలీసులకు సహకరించాలని కోరారు. సమావేశంలో ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ చిన్మయ్ కుమార్, అదనపు సీపీ ఎం.శ్రీనివాసులు, సైబర్ క్రైమ్స్ డీసీపీ అరవింద్ బాబు, ఏసీపీ శివమారుతితోపాటు 45 బ్యాంకులకు చెందిన 75మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
Also read: ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్న కౌన్సిలర్.. పోలీసుల మౌనం వెనుక మర్మమేంటో..?