Hyderabad Traffic Diversion: నగరంలోని యూసఫ్గూడ పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కీలక హెచ్చరిక జారీ చేశారు. సోమవారం (జనవరి 12, 2026) మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగం ఆధ్వర్యంలో శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో “అరైవ్ అలైవ్ – సురక్షిత రహదారుల కోసం ప్రచారం” అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ అవగాహన సదస్సుకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత మరియు సామాన్య ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రద్దీని నియంత్రించేందుకు మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు.
ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, పోలీసులకు సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరారు. కార్యక్రమానికి వచ్చే సాధారణ ప్రజల వాహనాల కోసం యూసఫ్గూడలోని TGSP బెటాలియన్ గ్రౌండ్లో ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.
మైత్రివనం నుండి బోరబండ వైపు: మైత్రివనం జంక్షన్ నుండి రహమత్నగర్, బోరబండ వెళ్లే వాహనాలను యూసఫ్గూడ బస్తీ వద్ద మళ్లిస్తారు. ఇవి కృష్ణకాంత్ పార్క్, కళ్యాణ్ నగర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
మైత్రివనం నుండి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వైపు: యూసఫ్గూడ చెక్పోస్ట్ మీదుగా జూబ్లీహిల్స్ వెళ్లే వాహనాలు యూసఫ్గూడ బస్తీ వద్ద RBI క్వార్టర్స్, కృష్ణా నగర్ జంక్షన్ వైపు వెళ్లాలి.
జూబ్లీహిల్స్ నుండి స్టేడియం వైపు: జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, వెంకటగిరి నుండి వచ్చే వాహనాలు కృష్ణా నగర్ జంక్షన్ వద్ద శ్రీనగర్ కాలనీ, పంజాగుట్ట వైపు మళ్లించబడతాయి.
బోరబండ నుండి మైత్రివనం వైపు: బోరబండ బస్టాప్ నుండి వచ్చే వాహనాలు ప్రైమ్ గార్డెన్ ఫంక్షన్ హాల్ వద్ద శ్రీరామ్ నగర్ ఎక్స్ రోడ్స్ మీదుగా జీటీఎస్ కాలనీ, వెంగళరావు నగర్, ఉమేష్ చంద్ర విగ్రహం మీదుగా మైత్రివనం చేరుకోవాలి.
Read also: నిషేధాజ్ఞల మధ్య నిలిచిన సంప్రదాయం.. కోడి పందాల వెనుక ఉన్న ఆసక్తికర చరిత్ర !