Hyderabad Traffic: హైదరాబాద్ నగరవాసులను ఏళ్ల తరబడి వేధిస్తున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహాన్ని అమలులోకి తెచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా శనివారం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టారు. ఈ బదిలీల్లో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ట్రాఫిక్ నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
గతంలో జిల్లాల్లో అదనపు ఎస్పీలుగా, ఆపరేషన్స్ విభాగాల్లో సమర్థవంతంగా పనిచేసి చురుగ్గా ఉండే యువ ఐపీఎస్ అధికారులను ఎంపిక చేసి, వారికి నగరంలోని కీలక జోన్లలో ట్రాఫిక్ డీసీపీలుగా బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో పాటు కొత్తగా రూపుదిద్దుకుంటున్న ‘ఫ్యూచర్ సిటీ’ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ మార్పుల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
ఈ బదిలీల్లో భాగంగా కొత్తగూడెం ఆపరేషన్స్ అదనపు ఎస్పీ అవినాష్ కుమార్ను హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-1గా, ఉట్నూరు అదనపు ఎస్పీ కాజల్ను హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-2గా నియమించారు. జగిత్యాల అదనపు ఎస్పీ ఎస్. శేషాద్రి రెడ్డిని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-2 బాధ్యతల్లోకి తీసుకురాగా, భువనగిరి అదనపు ఎస్పీ కనకాల రాహుల్ రెడ్డికి మల్కాజ్గిరి పరిధిలో ట్రాఫిక్ డీసీపీ-1 బాధ్యతలు అప్పగించారు. ములుగు జిల్లా ఆపరేషన్స్ అదనపు ఎస్పీగా పనిచేస్తున్న శివం ఉపాధ్యాయను ప్రతిష్ఠాత్మక ‘ఫ్యూచర్ సిటీ’ కమిషనరేట్ ట్రాఫిక్ డీసీపీగా నియమించడం విశేషం. వీరితో పాటు జి. చందనా దీప్తిని ఫ్యూచర్ సిటీ అడ్మిన్ మరియు ట్రాఫిక్ అదనపు సీపీగా, బికే రాహుల్ హెగ్డేను హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-3గా, జి. రంజన్ రతన్ కుమార్ను సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-1గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
అటు ట్రాఫిక్ నియంత్రణతో పాటు సహజ వనరుల లూటీని అరికట్టేందుకు కూడా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా వంటి అక్రమాలను అడ్డుకునేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో డీఐజీగా అభిషేక్ మహంతిని నియమించారు.
మొత్తంగా చూస్తే, తాజా బదిలీల్లో అటు సీనియర్ల అనుభవానికి, ఇటు యువ అధికారుల ఉత్సాహానికి సమ ప్రాధాన్యం కల్పిస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పోలీసు వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. యువ ఐపీఎస్ అధికారుల రాకతో నగరంలో ట్రాఫిక్ చిక్కులకు త్వరలోనే ‘చికిత్స’ లభిస్తుందని నగరవాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: ఖమ్మంలో బీజేపీ ఇద్దరు సర్పంచులను కూడా గెలిపించుకోలేదు: సీఎం రేవంత్ రెడ్డి