CPI Centenary Celebrations: ఖమ్మంలో జరిగిన సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బీజేపీ అనుసరిస్తున్న విధానాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, పేదల హక్కులను హరించేలా ఉన్నాయని ఆరోపించారు.
బీజేపీ మళ్ళీ రాజ్యాంగాన్ని చెరపట్టడానికి ప్రయత్నిస్తోందని సీఎం ఆరోపించారు. ఎస్ఐఆర్ (SIR) వంటి నిబంధనల ద్వారా పేదల ఓటు హక్కును తొలగించే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేదల చేతికి ఓటు అనే ఆయుధాన్ని ఇస్తే, నేడు మోడీ ప్రభుత్వం దానిని లాక్కోవాలని చూస్తోందని విమర్శించారు. ఓటు హక్కు పోతే రేషన్ కార్డు, పెన్షన్, ఇల్లు వంటి అన్ని సంక్షేమ పథకాలు పోతాయని ప్రజలను హెచ్చరించారు.
ఈ దేశంలోనే పుట్టి, పెరిగి, అడవుల్లో జీవిస్తున్న ఆదివాసీలను ఆధారాలు చూపమంటే వారు ఎక్కడి నుండి తెస్తారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇది కార్పొరేట్ శక్తుల కోసమేనని, శ్రీమంతుల ఓటుకు రక్షణ ఉండి పేదల ఓటుకు ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
“ఖమ్మం జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది.. ఇక్కడ నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు కలిసి వచ్చినా ఇద్దరు సర్పంచులను కూడా గెలిపించుకోలేరు.” అని సీఎం సవాల్ విసిరారు. ఖమ్మం అనే తులసి వనంలో గంజాయి మొక్కలైన బీజేపీకి స్థానం లేదని, కమ్యూనిస్టుల బలమైన ఉద్యమాల వల్లే ఆ పార్టీ ఇక్కడ అడుగుపెట్టలేకపోయిందని కొనియాడారు.
మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా ఎర్రజెండా ఎప్పుడూ ముందుంటుందని సీఎం అన్నారు. కమ్యూనిస్టులు పోరాడి ఇచ్చే నినాదాలను తాము చట్టాలుగా మారుస్తామని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే దిశగా కమ్యూనిస్టు సోదరులు కాంగ్రెస్తో కలిసి రావాలని పిలుపునిచ్చారు.
Read Also: మంత్రులపై వార్తలు రాసే ముందు నా వివరణ అడగండి: సింగరేణి వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు!