Hyderabad Murder: హైదరాబాద్ లో దారుణ హత్యకు గురైన కమలమ్మ (60) అనే వృద్ధురాలి కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. నిందితుడు ఆమెకు పాత చీర ఇస్తానని వెంటతీసుకెళ్లి చంపినట్లు పోలీసులు తేల్చారు. అర తులం బంగారం ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
శంషాబాద్ జోన్ డీసీపీ రాజేశ్ తెలిపిన ప్రకారం.. డిండి ప్రాంతానికి చెందిన కమలమ్మ గత 3 నెలలుగా హైదరాబాద్ మీర్ పేట్ లోని పాంచజన్య స్కూల్లో ఆయాగా పని చేస్తోంది. ఈ నెల 18న రూ.10 వేల జీతం తీసుకున్న కమలమ్మ.. ఆ తరువాత కనిపించకుండా పోయింది. ఆమె ఆచూకీ తెలియకపోవటంతో కుటుంబ సభ్యులు మీర్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు కేసు నమోదు చేసిన సీఐ శోభన్.. విచారణ చేపట్టారు. గాలింపు సాగుతుండగానే కమలమ్మ స్కూల్ పక్కనే నిర్మాణంలో ఉన్న ఓ భవనంలోని సంపులో దారుణ హత్యకు గురై కనిపించింది. దాంతో హత్యగా సెక్షన్ మార్చి పాంచజన్య స్కూల్ పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు సేకరించారు. కమలమ్మ స్కూల్ పక్కనే ఉన్న అందులో కమలమ్మ స్కూల్ పక్కనే ఉన్న శ్రీకృష్ణ హాట్ చిప్స్ దుకాణంలోకి వెళ్తూ కనిపించింది.
ఆ తర్వాత హాట్ చిప్స్ దుకాణం నడుపుతున్న ప్రకాశ్ (35) ఆమెను భవనం లోపలికి తీసుకెళ్తున్న దృశ్యాలను పోలీసులు గుర్తించారు. దాంతో పోలీసులు ప్రకాశ్ ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో కమలమ్మను తానే హత్య చేసినట్లు ప్రకాశ్ అంగీకరించాడు. కమలమ్మ తన దుకాణానికి ప్రతీరోజు వచ్చేదని.. ఈ క్రమంలోనే ఆమె చెవులకు ఉన్న బంగారు కమ్మలపై తన దృష్టి పడినట్లు నిందితుడు చెప్పాడు.
ఆర్థిక సమస్యల నేపథ్యంలో ఎలాగైనా వాటిని కాజేయాలని నిర్ణయించుకున్నట్టు పోలీసులకు తెలిపాడు. ఈ క్రమంలోనే కమలమ్మ తనకు ఓ పాత చీర ఇవ్వాలని కోరగా అదే అదనుగా ఈనెల 21న చీర ఇస్తానని చెప్పి ఆమెను నిర్మాణంలో ఉన్న భవనం లోపలికి తీసుకెళ్లినట్లు చెప్పాడు. మొదట చెక్కతో ఆమె తలపై బాది.. కింద పడిపోగానే కత్తితో కమలమ్మ మెడపై పొడిచి హత్య చేశానని అంగీకరించాడు. తర్వాత చెవికమ్మలు తీసుకుని మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచీలో మూటగట్టినట్టు వెల్లడించాడు.
Also Read: టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ.. మల్లు రవికి కీలక విజ్ఞప్తి!
అయితే మృతదేహానికి తరలించే అవకాశం రాకపోవటంతో నిర్మాణంలో ఉన్న భవనం సంపులోకి విసిరేసినట్టు చెప్పాడు. దోచుకున్న బంగారు చెవి కమ్మలను తాకట్టు పెట్టి 30 వేల రూపాయలు తీసుకున్నట్టు తెలిపాడు. ఈ క్రమంలో పోలీసులు ఆ చెవి కమ్మలను స్వాధీనం చేసుకుని నిందితునిపై కేసులు నమోదు చేసి జైలుకు రిమాండ్ చేశారు.
Also Read: ఓలా, ఉబర్లకు బదులు.. ప్రభుత్వమే యాప్ తేవాలి.. కవిత కీలక డిమాండ్!