HYDRAA: స్వేచ్చ బ్యూరో: హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలోని అంజయ్యనగర్ లో ఏడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు టైల్స్ కార్మికులు మృత్యువాత పడ్డారు. మరో పదిమందికి గాయాలయ్యాయి, ఈ విషాదానికి బిల్డర్ నిర్లక్ష్యం..కొంతమంది అధికారుల కాసుల కక్కుర్తే కారణమన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రమాదం గురించి తెలియగానే అగ్నిమాపక శాఖ, హైడ్రా, డీఆర్ఎఫ్, సైబరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ సిబ్బంది దుర్ఘటనా స్థలానికి వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించి ఇద్దరు కార్మికుల మృతదేహాలను వెలికి తీశారు. వివరాలు ఇలా ఉన్నాయి.
అంజయ్యనగర్ లోని నాలా పక్కనే సాజిద్ అనే బిల్డర్ 50గజాల స్థలంలో ఏడంతస్తుల భవనాన్ని కట్టిస్తున్నాడు. అన్ని అంతస్తులకు అనుమతులు లేకపోవటంతో ఇటీవల సైబరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు ఆ భవనాన్ని సీజ్ చేశారు. కొన్నిరోజులు గమ్మున ఉన్న సాజిద్ మళ్లీ పనులు మొదలు పెట్టాడు. భవనంలోని గదుల్లో టైల్స్ వేయిస్తున్నాడు. ఈ పనులు చేయటానికి మధ్యప్రదేశ్ కు చెంది ఉపాధిని వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చి కొండపూర్ లో నివాసముంటున్న మహబత్, ఉమేశ్ కారె అనే కార్మికులు శనివారం వచ్చారు.
మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వీళ్లు పనులు చేస్తుండగా ఓ పక్కకు ఒరిగిపోయిన భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. పెద్ద శబ్ధంతో భవనం కూలిపోవటంతో భయపడ్డ స్థానికులు, ఆ పరిసరాల్లోని భవనాల్లో ఉంటున్న వారు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. కూలిన భవనం శిథిలాలు పక్కనే ఉన్న అపార్ట్ మెంట్ పై పడటంతో అందులోని కొన్ని ఫ్లాట్లు దెబ్బతిన్నాయి. అందులో ఉంటున్న ఇద్దరు వృద్ధులతోపాటు పదిమందికి గాయాలైనట్టు సమాచారం.
Also Read: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్సిగ్నల్!
భవనం కూలటానికి కొద్దిసేపటి ముందు వరకు స్థానికంగా ఉంటున్న కొందరు పిల్లలు దాని ముందే ఆడుకున్నారని స్థానికులు చెబుతున్నారు. మధ్యాహ్నం కావటంతో వారి తల్లిదండ్రులు భోజనం చేయటానికి రావాలని వారిని ఇళ్లలోకి పిలిపించుకున్నారన్నారు. ఇంకా కొద్దిసేపు పిల్లలు అక్కడే ఆడుకుంటూ ఉన్నట్టయితే ఊహించని ఘోరం జరిగి ఉండేదన్నారు.
దుర్ఘటన గురించి తెలియగానే అగ్నిమాపక శాఖ, హైడ్రా, డీఆర్ఎఫ్ బృందాలతోపాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హ్యూమన్ ట్రేసింగ్ కెమెరాను శిథిలాల కిందకు పంపించారు. మహబత్, ఉమేశ్ కారేల మృతదేహాలను గుర్తించారు. అనంతరం కట్టర్ల సహాయంతో శిథిలాలను తొలగించి ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు. పంచనామా జరిపి పోస్టుమార్టం నిమిత్తం వాటిని మార్చురీకి తరలించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం కావటంతో సహాయక చర్యలను కొనసాగించారు.
హాస్టల్ కోసం అద్దెకు ఇవ్వటానికే ఈ భవనాన్ని నిర్మించినట్టుగా స్థానికుల తెలిపారు. టైల్స్ తోపాటు మిగితా పనులు పూర్తయి ఉంటే భవనం మొత్తాన్ని హాస్టల్ గా మార్చేవారని చెప్పారు. అదే జరిగి ఉంటే కనీసం 50మందికి పైగా ఈ భవనంలో ఉండేవారన్నారు. అప్పుడు ప్రమాదం జరిగి ఉంటే అని ఊహించుకుంటేనే భయం కలుగుతోందన్నారు.
Also Read: సీఎం విజయ్ సంచలనం.. ఏకంగా 1.28 లక్షల గోల్డ్ రింగ్స్కు ఆర్డర్.. తమిళనాట రచ్చ రచ్చ!
జరిగిన ప్రమాదంపై స్థానికులు మాట్లాడుతూ బిల్డర్ సాజిద్ నిర్లక్ష్యమే ఈ విషాదానికి కారణమన్నారు. 50గజాల స్థలంలో ఏడంతస్తులు భవనం కట్టటంతోపాటు ఓ పెంట్ హౌస్ ను కూడా నిర్మించాడన్నారు. భవన నిర్మాణానికి ఉపయోగించిన సిమెంట్, ఇసుక, కంకర నాణ్యతను కూడా పట్టించుకోలేదని చెప్పారు. ఇక, కొంతమంది మున్సిపల్ సిబ్బంది అవినీతి కూడా ఈ ప్రమాదానికి దారి తీసిందని చెప్పారు. ఇటీవల భవనాన్ని సీజ్ చేశామని అధికారులు చెబుతున్నారని..అనుమతులు లేకుండా ఏడు అంతస్తులు కట్టినపుడు వాళ్లు ఏం చేశారు? అని ప్రశ్నించారు. ఇదే ప్రమాదం సాయంత్రం వేళ జరిగి ఉంటే ప్రాణనష్టం మరింత ఎక్కువగా ఉండేదన్నారు.
భవనం కూలిన విషయం తెలిసి స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ప్రమాద స్థలానికి వచ్చారు. ఆయనతోపాటు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, హైడ్రా కమిషనర్ రంగనాథ్, స్థానిక పోలీసులు దుర్ఘటనా స్థలానికి వచ్చి సహాయక చర్యలను పర్యవేక్షించారు.
ప్రమాద స్థలంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ నాలా పక్కనే కేవలం 50గజాల స్థలంలో ఈ భవనాన్ని నిర్మించినట్టు చెప్పారు. ఏడంతస్తులపై పెంట్ హౌస్ కూడా కట్టినట్టు తెలిపారు. అంజయ్యనగర్ లో ఇలా 40..50..60గజాల్లో నిర్మించిన భవనాలు చాలా ఉన్నాయన్నారు. అధికశాతం భవనాలకు సెట్ బ్యాక్ లు కూడా లేవని చెప్పారు. పైగా, కొందరు నాలాను సైతం కబ్జా చేశారన్నారు. చాలా భవనాలను హాస్టళ్లకు అద్దెకిచ్చినట్టు తెలిపారు. మున్సిపల్ సిబ్బందితో కలిసి స్పెషల్ ఆపరేషన్ జరిపి ఇలాంటి భవనాలు అన్నింటినీ కూల్చివేస్తామని చెప్పారు. యజమానులు వెంటనే ఆయా భవనాలను ఖాళీ చేయించాలన్నారు. వాటిల్లో ఉంటున్నవారు స్వచ్ఛంధంగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని చెప్పారు. కాగా, జరిగిన ప్రమాదంపై మాదాపూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న బిల్డర్ సాజిద్ కోసం గాలిస్తున్నారు.
Alao Read: అనుచితంగా మట్లాడారు… పార్టీ లైన్ దాటారు.. కానీ క్రమశిక్షణ చర్యలు ఎప్పుడుంటాయో చెప్పలేము..!