Harish Rao: 22ఏ నిషేధిత జాబితా నుంచి కాలనీలను తొలగించి బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు డిమాండ్ చేశారు. లేదంటే బాధితుల పక్షాన బీఆర్ఎస్ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని హెచ్చరించారు. బోడుప్పల్ పరిధిలోని తిరుమల మెడోస్, లక్ష్మీ గణపతి కాలనీ, హేమానగర్ కాలనీలకు చెందిన వందలాది మంది 22ఏ బాధితులు హరీశ్ రావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ బాధితులు వచ్చి తమ ఆవేదన చెబుతుంటే గుండె కలిచివేసిందన్నారు.
సర్వే నంబర్ 215, 215 పార్ట్లలో 30 ఏళ్లుగా ఎలాంటి వివాదాలు లేకుండా సుమారు 1,500 కుటుంబాలు నివసిస్తున్నాయని హరీశ్ రావు అన్నారు. అయితే ఇళ్లను రాత్రికి రాత్రే కాంగ్రెస్ ప్రభుత్వం అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం అత్యంత దుర్మార్గమన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఇల్లు అమ్ముకుందామని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్తే.. ఆస్తి ప్రొహిబిషన్లో ఉందన్న విషయం తెలియడంతో కాలనీ వాసులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారన్నారు.
చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ అయిన ఇళ్లను అడ్డుపెట్టుకుని ప్రజలపై ఒత్తిడి తెచ్చి 30 శాతం కమీషన్లు దండుకునేందుకే ఇలాంటి కృత్రిమ వివాదాలు సృష్టిస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. దశాబ్దాలుగా ప్రశాంతంగా జీవిస్తున్న ప్రజలకు 22ఏ భయం చూపించి బినామీలకు సెటిల్మెంట్లు చేసుకునే అవకాశమిచ్చారని బాధితులు అంటున్నట్లు చెప్పారు. దీనికి ప్రభుత్వ సమాధానం ఏమిటి అని ప్రశ్నించారు.
Also Read: ఓలా, ఉబర్లకు బదులు.. ప్రభుత్వమే యాప్ తేవాలి.. కవిత కీలక డిమాండ్!
ఇది 30% కమిషన్ సర్కార్ అని ప్రజలే అంటున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ వసూళ్ల సర్కార్ మెడలు వంచైనా సరే ఆస్తులను కాపాడే బాధ్యతను బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. బోడుప్పల్ కాలనీ వాసులు సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాధితులందరూ అధైర్యపడవద్దు హరీశ్ రావు హామీ ఇచ్చారు.
Also Read: సీఎం విజయ్ సంచలనం.. ఏకంగా 1.28 లక్షల గోల్డ్ రింగ్స్కు ఆర్డర్.. తమిళనాట రచ్చ రచ్చ!