Kalvakuntla Kavitha: ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 24 నుంచి నిర్వహించనున్న బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ మేరకు బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ (టీఆర్టీయూ) సహా పలు ఆటో యూనియన్ ల నాయకులతో కలిసి బంద్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఆర్టీసీ యాజమాన్యానికి ఈవీ ఆటోలు ఇచ్చి లాస్ట్ మైల్ కనెక్టివిటీ సర్వీస్ ప్రారంభించాలన్న ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు.
లాస్ట్ మైల్ కనెక్టివిటీ సర్వీస్ ను ఇప్పుడున్న ఆటోడ్రైవర్లతో నడిపించాలని కవిత డిమాండ్ చేశారు. ఆటో, ట్రాన్స్ పోర్ట్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు అనుగుణంగా చార్జీలు పెంచాలన్నారు. ఓలా, ఉబర్, ర్యాపిడోలకు బదులుగా ప్రభుత్వమే యాప్ తీసుకురావాలని పట్టుబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేల చొప్పున అందజేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. కామారెడ్డి జీజీహెచ్ లో శిశువు మృతిపై ఎక్స్ లో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసవం కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన ఎక్కపల్లి తండాకు చెందిన గర్భిణికి సకాలంలో డెలివరీ చేయకపోవడంతోనే శిశువు మృతిచెందిందని తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని, శిశువును కోల్పోయిన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
Also Read: కొండా సురేఖ vs కాంగ్రెస్.. టీపీసీసీ చీఫ్, క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు
అటు గచ్చిబౌలిలో భవనం కూలిన ఘటనపై కూడా కవిత స్పందించారు. జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం ఎంతగా అవినీతిలో కూరుకుపోయిందో చెప్పేందుకు ఈ 7 అంతస్తుల భవనం సాక్షిగా నిలిచిందన్నారు. కేవలం 50 గజాల స్థలంలో ఏడు అంతస్తుల భవనం నిర్మిస్తుంటే జీహెచ్ఎంసీ అధికారులు ఎందుకు చూస్తూ ఊరుకున్నారు? అని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్ కు చెందిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఘటనకు కారణమైన భవన యజమానితోపాటు అనుమతులు ఇచ్చిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Also Read: సీఎం విజయ్ సంచలనం.. ఏకంగా 1.28 లక్షల గోల్డ్ రింగ్స్కు ఆర్డర్.. తమిళనాట రచ్చ రచ్చ!