సున్నం చెరువు విషయంలో కేవలం ఆక్రమణలే కాదు.. ఇక్కడి భూగర్భ జలాలు కూడా ఓ సీరియస్ ఇష్యూగా మారింది. ఈ ప్రాంతంలో బోర్లు వేసి నీటి దందా చేస్తున్నారు కొందరు. దీనిపై ఇప్పుడు హైడ్రా కన్నెర్ర చేస్తోంది. ఎందుకంటే ఇక్కడి జలాలు తీవ్ర స్థాయిలో కలుషితం అయ్యాయని ఇప్పటికే అధికారులు తెలిపారు. ఇక్కడ నీటితో దందా చేయవద్దని కూడా సూచించారు. కానీ ఇక్కడ నీటి వ్యాపారం మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే తీవ్ర దుర్గంధంతో పాటు.. కలుషితంగా మారింది సున్నం చెరువు. ఈ చెరువు చుట్టూ ఉన్న బోర్లలో ప్రమాదకర రసాయనాలు, భార లోహాలైన సీసం, కాడ్మియం, నికెల్ ఉందని హైడ్రా హెచ్చరించింది కూడా. ఇప్పటికే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా పరీక్షలు చేసింది. ఈ నీటిని తాగితే క్యాన్సర్ రోగాలతో పాటు హృదయ, కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయని హెచ్చరించింది హైడ్రా.
ఈ ప్రాంతంలో ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నీటిని తాగునీటిగా హాస్టళ్లు, నివాసాలకు, కార్యాలయాలకు సరఫరా చేయవద్దని హెచ్చరించింది హైడ్రా. PCB రిపోర్ట్ ఇచ్చినా.. హైడ్రా హెచ్చరించినా నీటి దందా ఆగలేదు. దీంతో హైడ్రా సీరియస్ యాక్షన్ తీసుకోవడం ప్రారంభించింది. ఓ వ్యాపారిపై ఏకంగా క్రిమినల్ కేసు నమోదు చేసింది. నీటి ట్యాంకర్లను సీజ్ చేసింది.. బోర్లను, షెడ్డులను తొలగించింది. మరికొంత మందిపై కూడా కేసులు నమోదు కానున్నాయి.
1970లో సర్వే ఆఫ్ ఇండియా చేసిన సర్వే ప్రకారం సున్నం చెరువు విస్తీర్ణం 26 ఎకరాలు. అయితే 2016లో HMDA రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో చెరువు విస్తీర్ణం మాత్రం 32 ఎకరాలుగా చెప్పింది. అయితే సున్నం చెరువు విస్తీర్ణం కేవలం 15 ఎకరాలే అనే వాదన కొందరిది. కానీ ఇది అవాస్తవమని చెబుతున్నారు హైడ్రా అధికారులు. గడచిన పదేళ్లలో FTL పరిధిలో నిర్మాణాలకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు అధికారులు. కానీ నిర్మాణాలు వెలిశాయని చెబుతున్నారు. ఒకవేళ బాధితులకు నిజంగా ఏమైనా అధికారిక పత్రాలు ఉంటే వారు పరిహారం కోసం సంప్రదించవచ్చని చెబుతున్నారు. అలా కాకుండా చెరువు పునరుద్దరణ పనులను అడ్డుకోవడం సరికాదని చెబుతున్నారు.
మరోవైపు దశాబ్ధాలుగా చెరువులో పేరుకుపోయిన చెత్త, మురుగును తొలగించే పనిలో ఉన్నారు అధికారులు. త్వరలోనే దానికి పూర్వ రూపం తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
Also Read: గద్వాల్ వాల్.. ఇక మనకి లేనట్టేనా?
మరోవైపు సున్నం చెరువు వద్దకు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వెళ్లారు. హైడ్రా కూల్చివేతలను ఎమ్మెల్యే అడ్డుకున్నారు. కూల్చివేతలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. లే అవుట్లోని ప్లాట్లను కూల్చివేయడాన్ని.. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వ్యతిరేకించారు.
హైడ్రా తీరుపై ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మండిపడ్డారు. ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేలా హైడ్రా వ్యవహరిస్తోందన్నారు. చెరువులు కబ్జా కాకుండా అభివృద్ధి చేయాలని.. కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తోందని.. కానీ హైడ్రా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుందన్నారు. సున్నం చెరువులో FTL, బఫర్ జోన్లను నిర్ధారించకుండా.. హైడ్రా కూల్చివేతలు చేయడం సరికాదన్నారు. హైడ్రా తీరుపై సీఎం రేవంత్కు ఫిర్యాదు చేస్తానన్నారు అరికెపూడి గాంధీ