Konda Surekha vs Ponguleti: ఓరుగల్లు కాంగ్రెస్లో విభేదాలు చిలికి చిలికి గాలివానలా మారుతున్నాయి. మంత్రి కొండా సురేఖ వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్న పంచాయతీ ఇప్పుడు ఇద్దరు సహచర మంత్రుల మధ్య రాజుకుంటోంది. ఏకంగా ఏఐసీసీ పెద్దల కోర్టులోకి పంచాయతీ చేరింది. ఇంతకీ ఓరుగల్లు నేతల మధ్య విభేదాలకు కారణాలేంటి.. కొండా సురేఖ తీసుకోబోతున్న స్టెప్ ఏంటి..?
సొంత పార్టీ ఎమ్మెల్యేలపై మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళీ చేసిన వ్యాఖ్యలు వరంగల్ జిల్లాలో పొలిటికల్ ప్రకంపనలు పుట్టించాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఒక్కటిగా జట్టుకట్టి. కొండా ఫ్యామిలీపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుకు ప్రతిగా కొండా మురళీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరిపై కౌంటర్ ఫిర్యాదు చేసి పొలిటికల్ సర్కిల్స్ లో మరింత హిట్ పెంచారు. పరిస్తితి చేయిదాటుతుందని గమనించిన అధిష్టానం ఇద్దరికీ సర్ది చెప్పడంతో కొద్ది రోజులుగా సైలెంట్ అయ్యారు. దీంతో హస్తం పార్టీలో నేతల మధ్య పోరుకు ఫుల్ స్టాప్ పడిందని భావించారు.
గత నెలలో భద్రకాళి ఆలయ ధర్మకర్తల నియామకం విషయంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ మధ్య మళ్ళీ పంచాయతీ మొదలైంది. మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే నాయినిపై వ్యంగస్త్రాలు సంధించడంతో అంటే ఘాటుగా నాయిని స్పందించాడు. దీంతో నివురుగప్పిన నిప్పులా తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేల మధ్య వైరం కొనసాగుతోందని చర్చ జరుగుతోంది.
మంత్రి కొండా సురేఖ పంచాయతీ ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలను దాటి.. మంత్రి పొంగులేటి పైకి మళ్ళింది. వరంగల్ ఇంచార్జీ మంత్రిగా ఉన్న పొంగులేటి, తనకు తెలియకుండానే తన డిపార్ట్మెంట్ లో ఇన్వాల్వ్ అవుతున్నాడని మంత్రి కొండా సురేఖ ఫైర్ అవుతోందట. తాజాగా మేడారం సమ్మక్క సారలమ్మల గద్దెల డెవలప్మెంట్, గ్రానైట్ తో గద్దెల చుట్టూ.. ప్రాకారం నిర్మాణానికి 71.80 కోట్లతో దేవాదాయ శాఖ టెండర్ లకు పిలుపిచ్చింది.
అయితే తన శాఖ టెండర్లలో తనకు తెలియకుండానే మంత్రి పొంగులేటి బిడ్డింగ్ లో పాల్గొన్నారట. అంతే కాకుండా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో టచ్ లో ఉంటూ టెండర్ వ్యవహారంలో అనుకూలంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీచేస్తున్నారట. ఈ విషయం దేవాదాయ శాఖ ఉన్నతాధికారి మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకురావడంతో ఆమె తీవ్రంగా పరిగణిస్తూ అధికారులకు వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఉన్న తన మాటే వినాలని, అధికారులతో పొంగులేటి సీరియస్ కావడంతో.. ఈ విషయంలో తాడోపేడో తేల్చుకోవాలని కొండా సురేఖ భావిస్తున్నారట.
సంవత్సరం క్రితం భద్రకాళి ఆలయ డెవలప్మెంట్ పనుల వ్యవహారంలోనూ మంత్రి పొంగులేటి తలదూర్చాడని గుర్రుగా ఉన్న మంత్రి కొండా సురేఖ, ఇప్పుడు తన శాఖ అధికారులతో తనకు తెలియకుండా మంతనాలు జరపడం సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పోలీసు అధికారుల ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్ ల విషయంలో తలదూర్చి తమపై కక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నారని, మంత్రి పొంగులేటిపై క్రమశిక్షణ కమిటీకి జూన్ నెలలో కొండా మురళీ ఫిర్యాదు చేశారు.
అప్పటినుండి పొంగులేటి తీరుతో ఆగ్రహంగా ఉన్న కొండా ఫ్యామిలీ తన డిపార్ట్మెంట్ లో పొంగులేటి అజమాయిషీ చేయడంపై తట్టుకోలేకపోతున్నారట. అందుకే డిల్లీ పెద్దల వద్దే పొంగులేటి వ్యవహారం తేల్చుకునేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. మరోవైపు మేడారం పనుల టెండర్ ఆన్లైన్ ప్రక్రియ, టెండర్ వేస్తే సహించరా అంటూ కొండా తీరుపై పొంగులేటి సైతం ఫైర్ అవుతున్నారట. టెండర్ వేయడంపై అభ్యంతరం లేదని, కానీ తన శాఖలోని అధికారులపై పెత్తనం చేయడం ఏంటని గుర్రుగా ఉన్నారట మంత్రి కొండా సురేఖ.
Also Read: పశ్చిమ బెంగాల్లో మరో ఘోరం.. మెడికల్ విద్యార్థినిపై అత్యాచారం
గత సంవత్సరంన్నర కాలంగా ఇంచార్జీ మంత్రి హోదాలో తమ ప్రాబల్యాన్ని తగ్గించే ప్రయత్నం చేయడమే కాకుండా.. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి తనకు వ్యతిరేకంగా పనిచేశారని, తన పరిధిలోని పనుల విషయంలో తనకు తెలియకుండా వ్యవహరిస్తున్నారని పొంగులేటిపై కొండా ఫ్యామిలీ వ్యతిరేఖంగా ఉంది. ఇప్పుడు ఏకంగా తన డిపార్ట్మెంట్ లో తలదూర్చడంతో తాడో పేడో తేల్చుకోవాల్సిందేనని భావిస్తున్నారట మంత్రి కొండా సురేఖ. డిల్లీ పెద్దల వద్దకు పంచాయితీ చేరితేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని కొండా మురళీ సైతం భావిస్తున్నారట. డిల్లీ పెద్దల కోర్టులో మంత్రుల మధ్య పోరుకు తెరపడేనా….? లేక ఇద్దరి మధ్య మరింత దూరం పెరిగేనా..? వేచి చూడాలి.