HYDRA: నిప్పుతో ఊహించని ముప్పు ఉంటుంన్న విషయాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ అగ్ని ప్రమాదాల నివారణ కోసం జాగ్రత్తలు పాటించాలని, ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించని వ్యాపార సంస్థలను సీజ్ చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాధ్ స్పష్టం చేశారు. వచ్చే నెల రెండో వారం నుంచే ఫైర్ సేఫ్టీపై తనిఖీలను మరింత ముమ్మరం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఫైర్ సేఫ్టీ అమలు విషయంలో నెలకొన్న అలసత్వం కారణంగా కేవలం 30 సెకెండ్ల సమయంలో మంటలు వ్యాపించే పరిస్థితి ఉందని, వేచ్చేది వేసవి కాలం కావటంతో జాగ్రత్తలు వహిస్తేనే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చనని ఆయన సూచించారు.
అగ్ని మాపక నిబంధనలన్ని తూచా తప్పకుండా అందరూ పాటించాలని, వేసవి కాలంలో మరింత ప్రమాదం పొంచి ఉందన్నారు. నగరంలో జరిగిన అనేక అగ్ని ప్రమాదాలను పరిశీలిస్తే నిబంధనలు పాటించకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తోందన్నారు. అందుకే హైడ్రా అగ్ని ప్రమాదాలపై దృష్టి సారించినట్లు ఆయన వివరించారు. ఈ క్రమంలోనే అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అగ్ని ప్రమాదాలపై పాతబస్తీలో గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జుల్ఫీకర్ అలీ తో కలిసి హైడ్రా కమిషనర్ పాల్గొని ప్రసంగించారు. తరచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాల నేపథ్యంలో జనవరి నెలాఖరులో తనిఖీలు చేపట్టి 9 షాపులను సీజ్ చేసినట్టు గుర్తు చేశారు. పలు వ్యాపార సంఘాల వినతుల మేరకు ఒక నెల రోజులు సమయమిచ్చామని, మార్చి నెల రెండో వారం నుంచి తనిఖీలు ముమ్మరం చేస్తామన్నారు. నిబంధనలు పాటించకపోతే ఆయా వ్యాపార సముదాయాలను, షాపులను సీజ్ చేసేందుకు వెనకాడేది లేదని ఆయన హెచ్చరించారు.
Also Read: GHMC: మూడు కార్పొరేషన్లలో అధికారుల కొరత.. డబుల్ బాధ్యతలతో బేజారవుతున్న ఆఫీసర్లు
అగ్ని ప్రమాదాల నేపథ్యంలో హైడ్రా తనిఖీలు నిర్వహించటం నిబంధనలు పాటించని వ్యాపార సుముదాయాలను సీజ్ చేయడాన్ని వేధించడంగా భావించవద్దని, ప్రమాదాలు జరగకుండా వహిస్తున్న జాగ్రత్తగా పరిగణించాలని హైడ్రా కమిషనర్ రంగనాధ్ సూచించారు. ఎవరైనా నిబంధనలు పాటించకపోతే తమకు సమాచారమివ్వాలని వ్యాపార సంఘాల ప్రతినిధులతో పాటు పౌరులను హైడ్రా కమిషనర్ కోరారు. ప్రజల భద్రతకు హైడ్రా పెద్ద పీట వేస్తుందన్నారు. వ్యాపారాలు ప్రశాంతంగా చేసుకోండి, జాగ్రత్తలు పాటించండి, మీతో పాటు మీ విలువైన వినియోగదారుల భద్రత గురించి ఆలోచించాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా గతంలో జరిగిన అగ్ని ప్రమాదాల వీడియోలు, రెస్క్యూ ఆపరేషన్లు, అగ్ని ప్రమాదాలకు గల కారణాలను వివరిస్తూ ప్రదర్శనలు నిర్వహించారు. అగ్ని ప్రమాదాలకు ఎవరు బాధ్యులు అనేది గ్రహించాలని చార్మినార్ ఎమ్మెల్యే జల్ఫికర్ అలీ అన్నారు. ప్రమాదాలు జరగక ముందే అప్రమత్తం కావాలని సూచించారు. రంజాన్ మాసంలో పెద్ద ఎత్తున వివిధ రకాల వస్తువుల వ్యాపారాలు జరుగుతాయని, భారీగా స్టాక్ ను భద్రపరిచినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవరికి వారు చెక్ చేసుకోవాలని సూచించారు. హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య ఆర్ఎఫ్ఓ జయప్రకాష్, డీఎఫ్ఓ లు యజ్ఞ నారాయణ, వెంకన్న, విద్యుత్ విభాగం అధికారి ఏవీ రామారావు, చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్ తో పాటు వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.