Uttam Kumar Reddy: రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలనపై ప్రజలు తమ పూర్తి విశ్వాసాన్ని ప్రకటించారని.. పురపాలక ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విజయం అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు ఇచ్చిన గొప్ప తీర్పు అని ఆయన అభివర్ణించారు.
సంక్షేమ పథకాలే విజయసోపానాలు
ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పంపిణీ పథకం ఈ ఎన్నికల్లో ‘గేమ్ ఛేంజర్’గా మారిందని మంత్రి తెలిపారు. రాష్ట్ర జనాభాలో 85% మందికి నాణ్యమైన సన్న బియ్యం ఉచితంగా అందించడం.. కొత్తగా తెల్ల రేషన్ కార్డుల మంజూరు చేయడం పేదల జీవితాల్లో వెలుగులు నింపాయని ఆయన గుర్తు చేశారు. వీటితో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లులు, పేద, మధ్యతరగతి వర్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి విప్లవాత్మక మార్పులు కాంగ్రెస్ పార్టీ భారీ విజయానికి దోహదం చేశాయని ఆయన వివరించారు.
వ్యవసాయ రంగంలో రికార్డులు
సాగునీటి రంగంలో ప్రభుత్వం సాధించిన ప్రగతి.. దేశ చరిత్రలోనే రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి మరియు కొనుగోలు ప్రక్రియ రైతాంగాన్ని కాంగ్రెస్ వైపు నిలిపాయని మంత్రి పేర్కొన్నారు. పల్లెలే కాకుండా, పట్టణ ప్రజలు కూడా ప్రభుత్వ పనితీరును ఆమోదించారని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. తెలంగాణ సమాజం మొత్తం కాంగ్రెస్ వెంటే ఉందనడానికి ఈ ఎన్నికలు అద్దం పడుతున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
సూర్యాపేట – కాంగ్రెస్ కంచుకోట
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన హుజూర్ నగర్తో పాటు నేరేడుచర్ల, కోదాడ, సూర్యాపేట ఫలితాలపై ప్రత్యేక హర్షం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని కంచుకోట అని మరోసారి రుజువైందన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలైన ఈ విజయ పరంపర.. లోక్సభ, గ్రామ పంచాయతీ ఎన్నికల మీదుగా ఇప్పుడు పురపాలక ఎన్నికల వరకు కొనసాగడం విశేషమన్నారు.
లోక్సభ ఎన్నికల్లో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో పార్టీ సాధించిన మెజారిటీలు జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించాయని ఆయన గుర్తు చేశారు. ఈ అఖండ విజయానికి కారకులైన పార్టీ కార్యకర్తలకు , ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: రేవంత్ సర్కార్కు ‘బ్రహ్మరథం’..! ప్రజా పాలనకే ప్రజల ఓటు.. మహేష్ కుమార్ గౌడ్