HYDRAA Demolitions: హైదరాబాద్ నగరంలోని చెరువుల పరిరక్షణ ధ్యేయంగా పుట్టుకొచ్చిన హైడ్రా, క్షేత్రస్థాయిలో చేస్తున్న కొన్ని తప్పిదాలు సామాన్యుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. సియేట్ కాలనీలోని సున్నంచెరువు పరిధిలో గతేడాది సెప్టెంబర్లో జరిగిన కూల్చివేతలు ఇందుకు సజీవ సాక్ష్యం. సర్వే నంబర్లు 12, 13లలో అన్ని అనుమతులు ఉన్నాయని, చట్టబద్ధంగానే నిర్మించామని యజమానులు ప్రాధేయపడినా, అధికారులు కనికరం లేకుండా జేసీబీలతో భవనాలను నేలమట్టం చేశారు. ఇన్నాళ్లూ కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ము కళ్లముందే శిథిలమవ్వడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
అధికారుల నుంచి అందిన ఆ ‘ఒక్క మెసేజ్’.. విస్తుపోతున్న బాధితులు
సమయం మించిపోయాక తప్పు తెలుసుకోవడం అంటే ఇదేనేమో! ఏడాది కాలంగా బాధితులు తమ గోడును కమిషనర్ రంగనాథ్కు మొరపెట్టుకుంటూనే ఉన్నారు. చివరికి 2025 సెప్టెంబర్లో హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ నుంచి బాధితుడికి వచ్చిన ఒక మెసేజ్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. “నో ఇష్యూ.. ప్లీజ్ గో ఎహెడ్ సార్” (ఏమీ ఇబ్బంది లేదు, పనులు మొదలుపెట్టుకోండి) అంటూ ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంటే, నాడు కూల్చింది పొరపాటేనని పరోక్షంగా ఒప్పుకున్నట్లయింది. పోయిన ప్రాణం తిరిగిరానట్టే, కూల్చిన ఇంటిని ప్రభుత్వం కట్టించి ఇవ్వదు సదా, ‘మళ్లీ కట్టుకో’ అని చెప్పడం బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట అని స్థానికులు మండిపడుతున్నారు.
లక్షల రూపాయల నష్టం.. దశాబ్దాల కష్టం బుగ్గిపాలు
హైడ్రా తీసుకున్న ఈ తొందరపాటు నిర్ణయం వల్ల ఒక సామాన్య భవన యజమాని దాదాపు రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు నష్టపోయారు. కేవలం ఆర్థిక నష్టమే కాదు, ఆ ఇంటి నిర్మాణంతో ముడిపడి ఉన్న భావోద్వేగాలు, పడిన శ్రమ అంతా వృథా అయ్యింది. ఇప్పుడు అధికారులు అనుమతి ఇచ్చినా, పెరిగిన నిర్మాణ సామాగ్రి ధరలతో మళ్లీ ఇల్లు కట్టుకోవడం ఆ కుటుంబానికి తలకు మించిన భారంగా మారింది. పర్మిషన్లు ఉన్నా పట్టించుకోకుండా కూల్చివేసి, ఇప్పుడు తీరిగ్గా ‘తప్పు జరిగింది’ అని చెప్పడం బాధితుల గాయంపై కారం చల్లడమే అవుతుంది.
హద్దుల నిర్ధారణలోనే అసలు లోపం.. అయోమయంలో కాలనీవాసులు
సియేట్ కాలనీవాసుల ప్రధాన ఆరోపణ ఏమిటంటే.. హైడ్రా అనుసరిస్తున్న హద్దుల నిర్ధారణ (Fixing of boundaries) ప్రక్రియే తప్పులతడకగా ఉందని. అసలు ఏది చెరువు భూమి, ఏది పట్టా భూమి అనే విషయంలో స్పష్టత లేకుండానే అధికారులు అడ్డగోలుగా కూల్చివేతలు చేపడుతున్నారని వారు వాపోతున్నారు. క్షేత్రస్థాయిలో సర్వే సరిగ్గా నిర్వహించకుండా, పాత మ్యాపులను పట్టుకుని సామాన్యుల ఇళ్లపైకి జేసీబీలను పంపడం వల్ల ఇలాంటి ‘పొరపాట్లు’ పునరావృతమవుతున్నాయి.
జవాబుదారీతనం ఎక్కడ? బాధ్యులపై చర్యలేవి?
పొరపాటున కూల్చేశాం అని సరిపెట్టుకుంటే సరిపోదు, ఆ నష్టానికి బాధ్యత వహించేది ఎవరన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. అనుమతులు ఉన్న భవనాలను కూల్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దకుండా, కేవలం కూల్చివేతలే లక్ష్యంగా ముందుకెళ్తే భవిష్యత్తులో హైడ్రా ప్రతిష్ట మసకబారే ప్రమాదం ఉంది. పాలకులైనా, అధికారులైనా సామాన్యుడి సొంతింటి కలను గౌరవించినప్పుడే నిజమైన న్యాయం జరుగుతుంది.
Also Read: ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?