Bamboo Smuggling: అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ వెదురు సంపద
• అడవి ఖాళీ అవుతున్నా పట్టించుకోని అధికార యంత్రాంగం?
• అశ్వారావుపేట – పేటమాలపల్లి బీట్లో వెదురు తోట ఖాళీ
• ఎక్కడ చూసినా వెదురు నరికిన ఆనవాళ్లే
• సామాన్య ప్రజలు చీపురు పుల్ల తెచ్చినా ఊరుకోని అధికారులు… అడవి ఖాళీ అవుతుంటే పట్టించుకోరా?
• సిబ్బంది తీరుపై ప్రజల్లో ఆగ్రహం
• వాచర్ ద్వారానే ఆ అధికారి వ్యాపారం?
• గతంలో అధికారులు వార్నింగ్ ఇచ్చినా బుద్ధి మార్చుకోని ఆ ఉద్యోగి?
• వాచర్ అడవికి ‘కింగ్ మేకర్’గా మారిన పరిస్థితి… ప్రశ్నిస్తే పై అధికారుల మద్దతు ఉందనే ఆరోపణలు
స్వేచ్ఛ బ్యూరో: అటవీ సంపదను కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లోని వెదురు సంపదను కొంతమంది స్థానిక వ్యక్తులు వేరే రాష్ట్రాల వారితో కుమ్మక్కై అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోని జిలుగుమిల్లి, స్వర్ణవారిగూడెం, రైతుగూడెం తదితర గ్రామాలకు ఈ వెదురు తరలుతున్నట్లు ప్రజల్లో చర్చ జరుగుతోంది.అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్లోని పొగాకు బారన్ రైతులకు భారీగా వెదురు కర్రలను సరఫరా చేస్తున్నట్లు గ్రామస్తుల ద్వారా సమాచారం వెలువడుతోంది.
ఈ వెదురు కర్రలు పొగాకు బారన్ వినియోగానికి వెళ్తున్నాయని, ఒక్కో కర్రను ₹10 నుంచి ₹16 వరకు ధరకు బేరసారాలు జరుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమ వ్యాపారంలో పెద్ద స్థాయిలో ముఠాలు పనిచేస్తున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు, పేటమాలపల్లి బీట్లో ఒక ప్రభుత్వ అధికారి మరియు వాచర్ కలిసి అకృత్యాలు కొనసాగిస్తున్నారని గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ వ్యవహారంలో అధికారులే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.
Also read: Rice Millers: మిర్యాలగూడలో మిల్లర్ల సిండికేట్ దందా.. ధరపై కన్నెర్ర చేసిన రైతన్న
అటవీ ప్రాంతాల్లో అక్రమంగా వెదురు నరికివేత జరుగుతున్నప్పటికీ, దీనిపై సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “కంచె చేను మేస్తున్నట్టుగా” వ్యవహరిస్తున్న అధికారుల తీరుతో తెలంగాణ అటవీ సంపద ఇతర రాష్ట్రాలకు తరలిపోతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే స్పందించి, అక్రమంగా వెదురు నరికివేత మరియు తరలింపుపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే, ఇందులో పాల్గొంటున్న వ్యక్తులు మరియు సహకరిస్తున్న అధికారులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Also read: వీధి కుక్కల విషయంలో జీహెచ్ఎంసీ సంచలన నిర్ణయం