Stray Dogs: స్వేచ్ఛ బ్యూరో: అసలే ఎండాకాలం.. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అన్ని రకాల సౌకర్యాలున్న మనుషులే కొన్ని సార్లు వేసవి తాపం తాళలేక ఉపశమనం కోసం అనేక ఏర్పాట్లు చేసుకుంటారు. ఇక వీధి కుక్కల పరిస్థితి ఏమిటీ? ముఖ్యంగా ఎండాకాలంలో బాగా ఎండలు మండిపోయే సమయంలో వీధి కుక్కలకు ఆహారం, తాగునీరు లభించక హరిటెట్ అయి మనుషులను కాటేస్తున్నట్లు ఇప్పటి వరకు జరిగిన పలు ఘటనల్లో జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. ప్రస్తుత వేసవి కాలంలో ఇలాంటి ఘటనలు జరగకుండా జీహెచ్ఎంసీ ముందస్తు చర్యలు చేపట్టింది. కుక్కలకు అన్ని సర్కిళ్లలో, కాలనీలు, బస్తీలు, కుక్కలు ఎక్కువగా సంచరించే ప్రాంతాలు, స్కూళ్లున్న ప్రాంతాలను గుర్తించి, తాగునీటిని అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.
2022 సెప్టెంబర్ మాసంలో బాగ్ అంబర్ పేట ప్రాంతాల్లో నాలుగేళ్ల ప్రదీప్ అనే చిన్నారిపై కుక్కల గుంపు దాడి చేయటంతో తీవ్ర గాయాలపాలైన ప్రదీప్ మృతి చెందిన సంఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. ఇలాంటి కుక్క కాట్ల ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు అప్పటి మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు వేసవి కాలంలో కుక్కలకు సకాలంలో ఆహారం, తాగునీరు లభిభించకపోవటంతోనే రెచ్చిపోతున్న విషయాన్ని గుర్తించి, జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి సర్కిల్ లో కాలనీలు, బస్తీల్లో కుక్కల కోసం వాటర్ పాండ్ లను అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇందుకు ప్రత్యేకమైన మార్గదర్శకాలను కూడా ఇచ్చింది. అప్పట్లో జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో సుమారు 3 వేల వాటర్ పాండ్ లను ఏర్పాటు చేశారు. కానీ గత సంవత్సరం వేసవి కాలంలో ఆరు జోన్ల పరిధిలోని 30 సర్కిళ్లలో ఏడు వేల వాటర్ పాండ్ లను కుక్కల కోసం ఏర్పాటు చేశారు. ఈ సారి కూడా అన్ని సర్కిళ్లలో వాటర్ పాండ్ లను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. చార్మినార్ జోన్ లో సుమారు వెయ్యికి పైగా వాటర్ పాండ్ లను ఏర్పాటు చేసే ప్రక్రియ తుది దశకు చేరినట్లు జీహెచ్ఎంసీ వెటర్నరీ అధికారులు తెలిపారు. ఇతర జోన్లలో కూడా వీలైనంత త్వరగా ఈ వాటర్ పాండ్ లను ఏర్పాటు చేస్తే, కొంత వరకు స్కూల్ కు రాకపోకలు సాగించే చిన్నారులు, వయోవృధ్దులకు కుక్క కాట్ల ఘటనలు తగ్గే అవకాశాలున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
Also Read: ఇది ప్రజా ప్రభుత్వమా? ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా? కేటీఆర్ వైల్డ్ ఫైర్!
జీహెచ్ఎంసీ పరిదిలోని 30 సర్కిళ్లలో కుక్కలు ఎక్కువగా సంచరించే బస్తీలు, కాలనీలను, చెత్త పోగైన ప్రాంతాలతో పాటు స్కూళ్లు, స్కూల్ కు విద్యార్థులు ఎక్కువ మంది రాకపోకలు సాగించే రూట్లను, ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులను గుర్తించి, నీడ ఉన్న ఓ చోట కుక్కలకు వాటర్ పాండ్ లను ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులు అన్ని సర్కళ్లలోని శానిటేషన్, వెటర్నరీ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా చెత్త కుప్పలు, కుక్కల సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలపై శానిటరీ ఫీల్డు అసిస్టెంట్లు (ఎస్ఎఫ్ఏ)లకు బాగా అవగాహన ఉండే అవకాశమున్నందున వాటర్ పాండ్ లను ఏర్పాటు చేసే బాధ్యత ఎస్ఎఫ్ఏ, వెటర్నరీ సిబ్బందికి అప్పగించారు.
డైలీ ఉదయం ఎండ తీవ్రం కాకముందే ఏడు గంటల కల్లా నీడ ఉన్న ప్రాంతాల్లో వాటర్ పాండ్లను ఏర్పాటు చేసి, వాటిని నీటిలో నింపిన తర్వాత ఫొటో తీసి సర్కిల్, జోన్ వారీగానే కాకుండా, ప్రధాన కార్యాలయం వెటర్నరీ వాట్సప్ గ్రూప్ షేర్ చేయాలని అధికారులు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఎండాకాలం కుక్క కాట్లు పెరగకుండా, కుక్కలకు దాహాం వేసినపుడు కూల్ గా తాగేందుకు నీటిని అందుబాటులో ఉంచేందుకు జీహెచ్ఎంసీ ఈ వేసవి కాలం కాస్త ముందుగానే తీసుకున్న ఈ నిర్ణయం ఏ మేరకు ఫలిస్తుందో? వేచి చూడాలి.
Also Read: కేంద్రమంత్రి గడ్కరీతో డీకే అరుణ భేటీ.. అభివృద్దికి భారీ స్కెచ్!